బిజెపి, టిడిపి గేమ్ లో జగన్ సేఫ్?

BJP

మూడు రాజధానులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని చిన్నా పెద్ద తెలుగు దేశం నాయకులు నిన్న మొన్నటివరకు గగ్గోలు పెట్టారు. మూడు రాజధానులకు అనుకూలంగా గవర్నర్ రాజముద్ర పడేసరికి ఎక్కడివారక్కడే గప్ చుప్  అయిపోయారు. “ఆంధ్రులకు మరోసారి అన్యాయం జరిగింది. ఇది బ్లాక్ డే ” అని చంద్రబాబు ఎంతో బాధను వ్యక్తం చేసినా ఆ పార్టీలో ఇప్పుడు చీమ కూడా చిటుక్కుమనడం లేదు. రాజధాని మార్పునకు నిరసనగా చంద్రబాబు సహా 20  మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారన్న ఫీలర్ ను ఎవరు వదిలారో తెలియదు కానీ అది బాగా వైరల్ అవుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ పదవికి బిటెక్ రవితో రాజీనామా చేయించడంతో కొంత  వేడి రగిలింది.

Read More :  బిగ్ న్యూస్ : చంద్ర‌బాబుతో స‌హా 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు..?

రాజధాని మార్పు తప్పదని, ముఖ్యమంత్రి జగన్ తన పంతం నెగ్గించుకుంటారని తెలుగుదేశం ఎమ్మెల్యేలకు బాగా తెలుసు. తనతో పాటు రాజీనామాలు చేయాలని సూచించినా ఆ ఎమ్మెల్యేలు అందుకు సిద్ధంగా లేనట్టు కన్పిస్తోంది. బాబు మరీ అంతగా బలవంతం చేస్తే ఆ ఎమ్మెల్యేలు ఆయనకు ఎదురుతిరిగి ఆయనకు సినిమా చూపించినా ఆశ్చర్యం లేదు. నిజమైన బ్లాక్ డే అంటే ఏమిటో ఆయనకు వారు చూపించవచ్చు. జగన్మోహనరెడ్డి ప్రభంజనం వీచిన గత ఎన్నికల్లో తాము ఎంతో కష్టపడి గెలిస్తే,  రాజధాని గేమ్ లో తమను బలిపశువులను చేయడమేమిటన్న బాధ ఆ టిడిపి ఎమ్మెల్యేలకు ఉండదా? ఈ విషయంపై రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని, చంద్రబాబు నాయుడు గెలిచేది కూడా అనుమానమేనని ఎన్ఠీఆర్ టిడిపి పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ ఆంతరంగిక  వ్యవహారాలను రిపోర్ట్ చేసిన  సీనియర్ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు.

Read More :  ఎన్టీఆర్ విగ్రహానికున్న విలువ అమరావతికి లేదా బాలయ్య 

న్యాయస్ధానాల్లో  చూసుకుంటామంటూ  చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని స్పష్టంగా కన్పిస్తోంది. కేంద్రమే జోక్యం చేసుకోవాలన్నందుకు….. ఆ కేంద్రమే తన జోక్యం ఎలా ఉంటుందో మౌనంగానే సమాధానం చెప్పింది. గవర్నరు రాజముద్ర శబ్దం, బిజెపి చీఫ్ గా సోము వీర్రాజు ఎంపిక పరమార్ధం- ఇవన్నీ కేంద్రం మౌనభాషకు సంకేతాలే. ” ఇప్పటి వరకు మేము ఆడిన ఆటలు వేరు. ఇప్పుడు చదరంగంలో పావులు కదిలిస్తాం . చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తాం” అని సోము వీర్రాజు చెప్పడంలో అనేక అర్ధాలు ఉన్నాయి.

Read More :  జ‌గ‌న్ స‌ర్కార్ పై.. నేష‌న‌ల్ జ‌ర్న‌లిస్ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఇప్పుడు చంద్రబాబు నాయుడు భయపడాల్సింది బీజేపీకే. ఎందుకంటే కార్యకర్తల బలం గల తెలుగుదేశం పార్టీ సంస్ధాగత పునాదులను కూల్చి వేసే వ్యూహాలను బిజెపి అనుసరించబోతున్నట్టు కన్పిస్తోంది. తమ తక్షణ శత్రువు వైఎస్సార్ సిపి, కాదని తెలుగుదేశమేనని ఆ పార్టీ ఆలస్యంగా గ్రహించింది. జగన్  పునాదులను ఇప్పుడే కదిలించ లేమని, మొదట ఎదురుగా ఉన్న సెకండ్ గ్రేడ్ పార్టీ అయిన టిడిపిని దెబ్బకొడితే, తర్వాత ఆ జోష్ తో ఎన్నేళ్లకైనా అధికార పార్టీని ఢీకొనవచ్చని బిజెపి మేధావులు వ్యూహ రచన చేస్తున్నట్టు కన్పిస్తోంది. ప్రభంజనంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ని ఎప్పుడైనా ఎదుర్కోవచ్చని, ఇప్పుడు చావు దెబ్బకొట్టాల్సింది, చేతికి చక్కగా అందుతున్న …. క్యాడర్ బేస్ ఉన్న…. టీడీపీనేనని బిజెపి అనుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఇంతకాలం అనేక ఎన్నికల్లో బిజెపికి మిత్రపక్షంగా ఉండి, చంద్రబాబు ధృతరాష్ట్ర కౌగిలిలో కుంగి కృశించిపోయామన్న వాస్తవాన్ని బిజెపి ఆలస్యంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఎటువంటి ఇబ్బంది కలిగించే అవకాశం లేదు. ఇప్పుడు బిజెపి దేశాధినేతల అశుభ దృష్టి తెలుగుదేశం పైన, ముఖ్యంగా చంద్రబాబు పైన ఉన్నాయనడంలో సందేహం లేదు. ‘పసుపు పచ్చ’ మీడియాలో కూడా ఈ అభిప్రాయం అక్కడక్కడా వ్యక్తమవుతోంది. కేంద్రం తలచుకుంటే ఏదైనా చేయగలదు, కేంద్రం తలచుకోకుండా ఏదీ జరగదు అన్నది ఇప్పటి నీతి.

—- శాంతారామ్