రాష్ట్రంలోని హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి ఓటు బ్యాంకుగా మారాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని, ఇకనైనా మేల్కొని ఐక్యత చాటాలని ఆయన అన్నారు. హిందూ సనాతన ధర్మ రక్షణే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు.
శనివారం కూకట్పల్లిలో నిర్వహించిన కాపు కులస్తుల కార్తిక వన భోజనాల కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్లో ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. మతం మార్చుకోవడం అంటే దేవుళ్లను మోసం చేయడమేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లోకి వెళ్లిన వారంతా ‘ఘర్ వాపసీ’ ద్వారా తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని కోరారు. అలా తిరిగి వచ్చేవారి కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ ప్రచారం ఫలితం హిందువుగా పుట్టడం గర్వకారణమని, హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పదని బండి సంజయ్ తెలిపారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై చేస్తున్న ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన మొదలైందన్నారు. మోసపోయి ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని ఆదుకునే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. కులాలు తమ సామాజికవర్గ సంక్షేమం కోసం పనిచేస్తూనే, హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

