తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇటీవల టోక్యోలో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. జపాన్కు చెందిన 150 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలకు తెలంగాణలో ఉన్న అవకాశాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో “తెలంగాణ రైజింగ్” పేరుతో తీసుకెళ్లిన ప్రజెంటేషన్ జపాన్ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా జపాన్ దిగ్గజ సంస్థలు ఎన్టీటీ డేటా, నెయిసా కలిసి రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడితో హైదరాబాద్లో అత్యాధునిక AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా దేశంలోనే అత్యంత శక్తివంతమైన 400 మెగావాట్ల ఏఐ సూపర్ కంప్యూటింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ AI సెంటర్లో 25 వేల GPUలను ఉపయోగించి ప్రపంచస్థాయి టెక్నాలజీ అందించనున్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలు, పరిశోధన కేంద్రాలతో కలిసి తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా మార్చేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.
ఇదే కార్యక్రమంలో తోషిబా సంస్థ తెలంగాణలో మరో కొత్త ప్లాంట్ కోసం రూ.562 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో కొత్త TTDI సర్జ్ అరెస్టర్స్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. GIS తయారీ కోసం TTDI ప్రస్తుత ప్లాంట్లను కూడా ఆధునీకరించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ సమక్షంలో జపాన్లోనే ఈ ఒప్పందాలకు సంబంధించిన ఎంవోయూలు కుదిరాయి.
టోక్యో నగరం అభివృద్ధి, మౌలిక సదుపాయాలు తమకు ఎంతో స్ఫూర్తిగా నిలిచాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో జపాన్ కంపెనీలకు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ఈ భారీ పెట్టుబడులతో తెలంగాణ, అంతర్జాతీయ స్థాయిలో AI రాజధానిగా ఎదిగేందుకు మరింత ముందుకు సాగనుంది.