Telangana High Court: నాగారం భూదాన్ భూములపై బినామీలు? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై హైకోర్టు నోటీసులు!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామంలో భూదాన్ భూములకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భూములపై అక్రమ లావాదేవీలు జరిగాయని, పలువురు ఉన్నతాధికారులు బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తూ మహేశ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భూదాన్ భూములపై ఉన్నతాధికారుల కుట్రలపై గతంలోనే ప్రభుత్వానికి, భూదాన్ బోర్డుకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేదని పేర్కొన్నారు. నిజాయితీగా దర్యాప్తు జరిగితే నిజాలు బయటపడతాయని, అందుకు సీబీఐ లేదా ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల జోక్యం అవసరమని అభిప్రాయపడ్డారు.

వాదనలు విచారించిన హైకోర్టు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 26వ తేదీన జరగనుంది. అంతవరకు ఈ భూదాన్ భూములపై ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాక, పిటిషన్‌లో పేర్కొన్న అధికారులు, వారి కుటుంబసభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఈడీ, సీబీఐలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంతో అధికారుల వర్గాల్లో కలకలం రేగింది. నిజంగా ఈ భూముల్లో బినామీల పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయా? ఉన్నతాధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంది? అన్న విషయాలు విచారణ అనంతరం తేలనుండగా, ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.

Public Reaction On YS Jagan To Amaravathi Meeting || Ap Public Talk || Ys Jagan || Telugu Rajyam