చిరంజీవి కోసం సుకుమార్ కథ.! అతి త్వరలో.!

దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ సినిమా పనుల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప ది రైజ్’ సాధించిన విజయంతో, ‘పుష్ప ది రూల్’పై పెరిగిపోయిన అంచనాల్ని అందుకోవడం సుకుమార్‌కి పెద్ద సవాలే. సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

ఆల్రెడీ సినిమా సెట్స్ మీదకు వెళ్ళిపోయిందంటున్నారుగానీ, ఆ సందడేమీ లేదు. ఇప్పటికైతే ‘పుష్ప’ టీమ్, రష్యాలో ‘పుష్ప ది రైజ్’ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో బిజీగా వుంది.

ఇదిలా వుంటే, మెగాస్టార్ చిరంజీవితో సుకుమార్ ఓ సినిమా చేయబోతున్నాడన్నది తాజా ఖబర్. కొన్నాళ్ళ క్రితం చిరంజీవితో ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరించాడు సుకుమార్. అప్పుడే, తనకో కథ సిద్ధం చేయమని చిరంజీవి, సుకుమార్‌కి చెప్పాడట.

ఎప్పటినుంచో చిరంజీవితో చేయాలనుకుంటున్న ఓ కథని సుకుమార్, త్వరలో చిరంజీవికి చెప్పబోతున్నాడట. అప్పట్లో అనుకున్న కథకి కొన్ని మార్పులు ఇటీవలే పూర్తి చేశాడని అంటున్నారు.

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ కోసం విదేశాలకు వెళ్ళగా, అట్నుంచి తిరిగిరాగానే సుకుమార్ కథ వింటారని సమాచారం. దర్శకత్వం మాత్రం సుకుమార్ చెయ్యబోయడట. సుకుమార్ శిష్యుడికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశముందట.