బెంగళూరులో ఇటీవల జరిగిన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్లో ప్రముఖ గాయకుడు సోను నిగమ్కు ఊహించని ఇబ్బంది ఎదురైంది. ఆయన పాటలు పాడుతున్న సమయంలో ఓ యువకుడు పదేపదే కన్నడ పాట పాడాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఒత్తిడి చేశాడు. దీంతో అసహనం చెందిన సోను నిగమ్ పాట మిడిల్లోనే ఆపేశారు. దీనిపై స్పందించిన ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
సోను నిగమ్ మాట్లాడుతూ, “ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు పెహల్గామ్ వంటి దుర్ఘటనలకు దారి తీస్తాయి” అన్నారు. ఈ కామెంట్తో ఆ షోలో ఒకింత హడావుడి నెలకొంది. అతని వ్యాఖ్యల ప్రకారం, భాషల మధ్య కలహం, ఒకరిపై మరొకరి ప్రభావం వంటి వాటివల్లే సమాజంలో ద్వేషం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, పెహల్గామ్ ఉగ్రదాడి ఉదాహరణ ఇచ్చిన విధానం మాత్రం పలువురికి అంతగా రుచించలేదు.
తన కెరీర్లో కన్నడ భాషలో పాడిన గొప్ప పాటలను గుర్తు చేసిన సోను, “ఇవన్నీ నా జీవితంలోని బెస్ట్ సాంగ్స్, ఆ సమయంలో గొడవ చేస్తున్న ఈ యువకుడు పుట్టకముందే పాడాను” అంటూ తన చరిత్రను వివరించారు. తెలుగు, తమిళ, హిందీ సహా అనేక భాషల్లో పాటలు పాడిన సోను, అన్ని ప్రాంతీయ ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తానని వివరించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో రెండు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాలు సోనును సమర్థిస్తుంటే, మరికొన్ని ఆయన వ్యాఖ్యలపై అసహనం చూపిస్తున్నాయి. అయితే ఇలాంటి వేడుకలో, పెహల్గామ్ ఉదాహరణను తీసుకు రావడం కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు.