మేటర్ సీరియస్: పోలీసులకు కోపం తెప్పించిన రేవంత్!

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలన్నీ టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ఎంత తొందరగా తేల్చి.. చేతులు కడేసుకోవాలా అని అధికారపార్టీ చూస్తుంటే.. ఈ వ్యవహారంపై రాజకీయంగా ఎంత క్యాష్ చేసుకోగలిగితే అంతా చేసుకునేలా విపక్షాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే కావాల్సినన్ని మార్కులు కొట్టేసిన రేవంత్… తాజాగా చేసిన కొన్ని అర్థజ్ఞాన మాటలు పోలీసు అధికారులకు ఆగ్రహం తెప్పించాయి!

అవును… టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసును విచారిస్తున్న సిట్ అధికారిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీస్ వర్గాలు సీరియస్‌ గా ఉన్నట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. గ్రూప్-1 పరీక్షలు రాసిన వారిలో దాదాపు 100 మందికి 103 మార్కులు వచ్చాయని.. వీళ్లందరూ నిందితుడు రాజశేఖర్ మండలానికి చెందిన వారే అని రేవంత్ ఆరోపించారు. ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్న సిట్.. రేవంత్‌ కు నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన ఆరోపణలపై ఏవైనా ఆధారాలు ఉంటే చెప్పాలని కోరింది.

ఆ నోటీసులు అందుకున్న రేవంత్.. నెల 23న సిట్ కార్యాలయానికి వచ్చారు. అయితే సిట్ కార్యాలయానికొచ్చినా గంట సేపు కార్యాలయంలో కూర్చున్న రేవంత్.. దర్యాప్తుకు పని కొచ్చే ఒక్క విషయాన్ని కూడా చెప్పలేదని.. తమకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని సిట్ అధికారులు చెప్పారు. పైగా బయటకు వచ్చి విలేకరుల ముందు అనవసరమైన ఆరోపణలు చేశారని చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ కేసును విచారిస్తున్న సిట్ అధికారి, పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ పై స్పందించిన రేవంత్… ఆయన ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని.. పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కూడా ఆంధ్రా వ్యక్తే.. అలాటప్పుడు ఈ దర్యాప్తులో న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

ఒక ఆంధ్రా వ్యక్తి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే.. దాన్ని మరో ఆంధ్రా అధికారితో దర్యాప్తు చేయించడం ఏంటని విలేకరుల ముందు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పోలీస్ అధికారులు సీరియస్ అవుతున్నారు. ఏఆర్ శ్రీనివాస్ పుట్టిన దగ్గర నుంచి తెలంగాణలోనే ఉన్నారని.. ఆయన తల్లిదండ్రులు మాత్రం ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన వారని అధికారులు చెబుతున్నారు. అయినా సరే, ఒక పోలీస్ అధికారి ప్రాంతీయతను ముందుకు తీసుకొని వచ్చి.. ఆయన చిత్తశుద్దిని ప్రశ్నించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అతిముఖ్యమైన, అత్యంత కీలమైన కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి పట్ల లేనిపోని ఆరోపణలు చేయడం తగదని చెబుతున్న పోలీసులు… ఈ విషయంపై త్వరలో వివరణ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ఏ కారణంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారో చెప్పాలని.. లేదంటే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.