Revanth Reddy: జపాన్ టూర్.. 12 వేల కోట్లతో రేవంత్ రెడ్డి న్యూ రికార్డ్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నెల 16న జపాన్‌ వెళ్లిన సీఎం బృందం, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానించింది. ఈ పర్యటన ఫలితంగా మొత్తం రూ. 12,062 కోట్ల పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు.

శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరిన సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, సుమారు 35,000 ఉద్యోగాలు ఈ పెట్టుబడుల ద్వారా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, పరిశ్రమల రంగాల్లో యువతకు గేట్లు తెరుచుకుంటాయన్న ఆశ కలుగుతోంది. అభివృద్ధిలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ఒప్పందాలను ప్రభుత్వం కీలకమైన అడుగుగా పేర్కొంది.

జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీ హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును స్థాపించేందుకు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మానవ వనరులకు అనుగుణంగా ఆధునిక పరిశ్రమలకు కేంద్రంగా మారనుంది. ఇదే సమయంలో, ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలతోనూ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 10,500 కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకుంది.

వీటి ద్వారా హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం పర్యటన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో పెట్టుబడుల హబ్‌గా అభివృద్ధి చెందించాలన్న దిశగా మరో కీలక ఘట్టం ప్రారంభించినట్లైంది. జపాన్ సంస్థలు తెలంగాణపై చూపిన ఆసక్తి, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు బాటలు వేయవచ్చన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.

జనసేనలోకి దువ్వాడ? || Duvvada Srinivas Suspended From YCP || Duvvada To Join In Janasena || TR