జమ్మూకశ్మీర్లోని బైసరన్ లోయలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దాడికి ముందు ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఉండొచ్చన్న అనుమానాలను బలపరుస్తూ, ఓ పర్యాటకుడి వీడియో కీలక ఆధారంగా మారింది. ఈ వీడియోను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులకు అప్పగించడంతో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది.
పుణేకు చెందిన మలయాళీ సామాజిక కార్యకర్త శ్రేజిత్ రమేశన్ కుటుంబంతో కలిసి ఏప్రిల్ 18న బేతాబ్ వ్యాలీని సందర్శించారు. అక్కడ తీసిన ఒక వీడియోలో ఇద్దరు అనుమానిత వ్యక్తులు కనిపించారని, తాజాగా విడుదలైన ఉగ్రవాదుల ఊహాచిత్రాలతో వారిని పోలుస్తున్నారని ఆయన గుర్తించారు. దీనిపై అప్రమత్తమైన రమేశన్, తన దగ్గర ఉన్న వీడియోను వెంటనే ఎన్ఐఏకు పంపించారు.
వీడియోలో కనిపించిన వ్యక్తుల వేషధారణ, హావభావాలు క్షుణ్ణంగా పరిశీలనకు వచ్చాయి. బేతాబ్ వ్యాలీ నుండి బైసరన్ వ్యాలీకి దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉండటం, రెండూ పర్యాటకులు ఎక్కువగా వెళ్లే ప్రాంతాలుగా ఉండటంతో ఈ అనుమానం బలపడుతోంది. ఉగ్రవాదులు ముందుగా ఈ ప్రాంతాల్లో దాడికి అనువైన ప్రదేశాలపై సమాచారం సేకరించి ఉంటారన్నది నిపుణుల అభిప్రాయం.
ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం ఆ వీడియోను ఫోరెన్సిక్గా విశ్లేషిస్తున్నారు. ఇందులోని వ్యక్తులు నిజంగా దాడికి పాల్పడ్డవారేనా అనే విషయం త్వరలో తేలనుంది. విచారణకు అవసరమైనప్పుడు హాజరుకావాలని అధికారుల సూచన ఉందని, మీడియాతో మాట్లాడొద్దని తనకు సూచించారంటూ రమేశన్ పత్రికలకు తెలిపినట్లు సమాచారం. ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు వేగం పుంజుకుంటుందని అనుకోవచ్చు.