రాజకీయాల్లోకి రాహుల్ సిప్లిగంజ్… నితిన్ కి కొనసాగింపు?

సినిమా రంగానికి చెందినవారికి రాజకీయ రంగంలోకి ప్రవేశం అత్యంత సులువుగా దొరుకుతుందని అంటుంటారు. ఇదే సమయంలో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి రాష్ట్రాలను ఏలినవారూ ఉన్నారు.. చతికిలపడిన పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో రాహుల్ సిప్లిగంజ్ రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

గతకొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హీరో నితిన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నితిన్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయనతో చర్చలు జరుపుతున్నారని.. నిజామాబాద్ నుంచి ఆయన పోటీ ఉండొచ్చని గాసిప్స్ హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో త్వరలో రాహుల్ సిప్లిగంజ్ ను కూడా రాజకీయాల్లోకి తేబోతున్నారని.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుందని అంటున్నారు.

బిగ్‌ బాస్ విన్నర్‌, ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు రాజకీయ రంగప్రవేశానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల బరిలో రాహుల్ పోటీ చేస్తారని ఒక గాసిప్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. ఇందులో భాగంగా… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి రాహుల్ సిప్లిగంజ్ సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ ముందుకు వస్తే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలబెట్టబోతోందని అంటున్నారు.

ఇదే క్రమంలో ఏకంగా రాహుల్ కి కేటాయించబోయే నియోజకవర్గం పేరు కూడా తెరపైకి రావడం గమనార్హం. ఇందులో భాగంగా… హైదరబాద్ లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్దిగా రాహుల్ సిప్లిగంజ్ కు అవకాశం కల్పించేలా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. గోషామహల్ నుంచి కాంగ్రెస్ కు రాహుల్ సరైన అభ్యర్ది అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు.

కాగా… గోషామహల్ నుంచి ప్రస్తుతం సిట్టిగ్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి రాజా సింగ్ ఉన్న సంగతి తెలిసిందే. 2009లో బీజేపీ నుంచి పోటీచేసిన ప్రేం సింగ్ రాథోడ్… 2018 ఎన్నికల్లో బీఆరెస్స్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో గతేన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ స్థానంలో పోటీచేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా ఈ సీటు ఆశిస్తున్నారని అంటున్నారు.

ఈ సమయంలో కాంగ్రెస్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ అయితేనే ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో సరైన అభ్యర్ది అని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో పార్టీ క్లియర్ గానే ఉన్నప్పటికీ… రాహుల్ నుంచి ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ… కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం మరింత జోష్ లో ఉన్న కాంగ్రెస్ నేతలు తెలంగాణలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటం శుభపరిణామమే!