పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ పోస్టు… ఆపమంటూ రిక్వస్టు!

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో హడావిడి అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ తను ఉండే ఏరియా గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

అవును… తన పొలిటికల్ ఎంట్రీపై వస్తోన్న కథనాలపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తల్ని ఖండించారు. రాజకీయాల్లోకి రావడం లేదని.. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలో వాస్తవం లేదని తేల్చేశారు.

ఈ మేరకు ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టిన రాహుల్… నేను పాలిటిక్స్ లోకి రావట్లేదు. నా మీద చాలా రూమర్స్ వస్తున్నాయి, నేను గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీచేస్తానని. ఆ వార్తలన్నీ అబద్ధం. అన్ని పార్టీలకి చెందిన మన లీడర్స్ అందరిని నేను గౌరవిస్తాను. నేను ఒక మ్యుజిషియన్, ఆర్టిస్ట్ మాత్రమే” అని స్పష్టం చేశాడు.

ఇదే సమయంలో… “నా జీవితం అంతా కూడా నేను ఇదే. నా ఫీల్డ్ లో నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రస్తుతానికి నా కెరీర్ పైనే నేను ఫోకస్ చేశాను. నాకు ఏ పార్టీ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు. ఇలాంటి వార్తలు ఇకనైనా ఆపండి” అని తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

కాగా… రాహుల్‌ సిప్లీగంజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని.. కాంగ్రెస్ పార్టీ తరపున గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడని.. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కూడా జరిగాయని.. ఇక అధికారిక ప్రకటన ఒకటే మిగిలిఉందని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో రేవంత్ రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో గాసిప్స్ హల్ చల్ చేశాయి. దీంతో స్వయంగా రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని.. ఏ పార్టీ తరపున పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు.