Shiva Prasad Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్పై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ శుభాకాంక్షలు తెలపడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం రాజకీయ స్వార్థంతో కూడిన చర్యే తప్ప, నిజమైన గౌరవం కాదని ఆయన ఆరోపించారు.
అప్పుడేమో ‘విజయ’.. ఇప్పుడేమో ‘విజయమ్మ’?
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… గతంలో నారా లోకేష్ వైఎస్ విజయమ్మ పట్ల ప్రదర్శించిన తీరును ఎండగట్టారు. “రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ లేనిది, ఉన్నట్టుండి లోకేష్కు విజయమ్మ గారిపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది?” అని ప్రశ్నించారు.
గతంలో లోకేష్ ఎప్పుడూ విజయమ్మను గౌరవంగా పిలవలేదని, ఒక సామాన్య స్త్రీని లేదా స్నేహితురాలిని సంబోధించినట్లు ‘వైఎస్ విజయ’ అని పిలిచేవారని గుర్తు చేశారు. తన వయసు ఎంత, ఆమె వయసు ఎంత అనే కనీస విచక్షణ లేకుండా మాట్లాడిన లోకేష్, ఈరోజు హఠాత్తుగా ‘విజయమ్మ గారు’ అంటూ ట్వీట్ చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందని విమర్శించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్న అంతర్గత విభేదాలను రాజకీయంగా వాడుకోవడమే లోకేష్ లక్ష్యమని రాచమల్లు ఆరోపించారు. “జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిసీ, ఆ కుటుంబంలోని కలహాలను సాకుగా చూపి రాజకీయ లబ్ధి పొందాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అందుకే మునుపెన్నడూ లేని విధంగా ఆమె ఆరోగ్యం, మానసిక శాంతి గురించి ట్వీట్లు చేస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏమిటంటే సాధారణంగా రాజకీయాల్లో ప్రతి అడుగు వెనుక ఒక బలమైన ఉద్దేశం ఉంటుందని, లోకేష్ ట్వీట్ కూడా అదే కోవలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం ఇది ముమ్మాటికీ వైఎస్ కుటుంబంపై చేస్తున్న రాజకీయ దాడిగానే పరిగణిస్తున్నారు అని అంటున్నారు.
ఏప్రిల్ 19న విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మర్యాద పూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం తప్పా? లేక ఇందులో రాజకీయ కోణం ఉందా? అన్నది ఇప్పుడు AP ప్రజలకు హాట్ టాపిక్ గా మారింది.

