ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా, ఐదు ఏపీలో, ఐదు తెలంగాణలో ఉన్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3న నోటిఫికేషన్ జారీ అవుతుండగా, మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.
మార్చి 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఉపసంహరణకు గడువు మార్చి 13వరకు ఉంటుందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మార్చి 20న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, డి.రామారావు, పి.అశోక్ బాబు, తిరుమలనాయుడు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.
తెలంగాణలో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మీర్జా రియాజుల్ హసన్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం ఎమ్మెల్సీ పదవులు కూడా వచ్చే నెలలో ముగుస్తాయి. ఈ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందనే అంశంపై అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. శాసనమండలిలో గణాంకాలు మారే అవకాశం ఉన్నందున ఈ ఎన్నికలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.