MAVIGUN: చంద్రబాబు నిర్ణయాల వల్లే రాష్ట్రం దివాళా: మావిగన్ ప్రతిపాదనపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

MAVIGUN: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (MAVIGUN) కాన్సెప్ట్‌పై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా తప్పుబట్టారు. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, అవినీతి కారణంగా నేడు అది రాష్ట్రానికి ఒక మోయలేని ‘గుదిబండ’గా మారిందని ఆయన విమర్శించారు.

సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ కూటమి నేతలపై నిప్పులు చెరిగారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.

చంద్రబాబు నాయుడు తన స్వార్థం, అత్యాశ కోసం అమరావతి పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీయించే మార్గంలో నడిపిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న అంతులేని అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని, అందుకే జగన్ గారు ఆర్థికంగా వెసులుబాటు ఉండే ‘మావిగన్’ ప్రతిపాదనను తెచ్చారని పేర్కొన్నారు.

“మావిగన్ ప్రతిపాదనను సాంకేతికంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పలేని కూటమి నేతలు, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మంత్రులకు బూతు పాఠాలు నేర్పించి జగన్ గారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. బూతులతో ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు కానీ, వాస్తవానికి మీ విమర్శలే మావిగన్ కాన్సెప్ట్‌ను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాయి” అని నాని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు కేబినెట్‌లోని సగం మంది మంత్రులు గతంలో ఆయన్ను తిట్టిన వారేనని పేర్ని నాని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబును ఎన్టీఆర్ తిట్టినట్లుగా తిట్టారని, ఔరంగజేబుతో పోల్చారని విమర్శించారు. చంద్రబాబును అవినీతిపరుడని, ఆయన్ను గెలిపిస్తే అవినీతిని ప్రోత్సహించినట్టేనని స్వయంగా పవన్ ప్రకటించారని గుర్తు చేశారు. ప్రస్తుత 164 మంది ఎమ్మెల్యేల్లో 100 మందికి పైగా గతంలో చంద్రబాబును దూషించిన వారేనని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

పురందేశ్వరి, దగ్గుబాటి ప్రస్తావన
చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘టార్చ్‌లైట్ మినిస్టర్’ అని బాబుపై పుస్తకాలే రాశారని, ఆ పుస్తకాలను నేడు టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచిపెట్టగలరా? అని ప్రశ్నించారు. పురందేశ్వరి సైతం గతంలో అనేకసార్లు బాబు తీరును ఎండగట్టారని గుర్తు చేశారు. మోదీ-చంద్రబాబు ఒకరినొకరు దూషించుకున్న సందర్భాలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

“రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. వ్యక్తిగత దాడులు, బూతులు మానుకుని రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి” అని పేర్ని నాని హితవు పలికారు.

Mavigun Tension Starts In Kutami Govt | Chandrababu | Telugu Rajyam