గత ప్రభుత్వం రుషికొండపై ప్రజాధనంతో నిర్మించిన అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ ను చూసి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఆయన మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండకు చేరుకున్నారు.
ప్యాలెస్ లోపల ఉన్న బెడ్ రూమ్ లు, బాత్ రూమ్ లలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలను చూసి పవన్ కల్యాణ్ విస్మయం చెందారు. ప్రజాధనాన్ని ఇంత విలాసవంతమైన నిర్మాణాలకు వాడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏటా రూ. 7 కోట్ల ఆదాయం వచ్చేదని తెలిపారు. కానీ, ఇప్పుడు ఈ కొత్త భవనాల నిర్వహణకే దాదాపు రూ. 1 కోటి బిల్లులు బకాయి పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ భవనాల నిర్మాణంపై ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు నడుస్తోందని అధికారులు పవన్ కల్యాణ్ కు వివరించారు. ఈ అంశంపై శాసనసభ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
“ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది కూడా పోతుంది” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాలను పరిశీలించడానికి పోలీసులు అడ్డుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకు వచ్చానని తెలిపారు. పాడైపోతున్న భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


