పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ సంచలనాత్మక ప్రకటన చేసింది. దశాబ్దాలుగా భారత్-పాక్ సంబంధాల పునాది లాంటి సిమ్లా ఒప్పందంను సస్పెండ్ చేస్తున్నట్లు ఇస్లామాబాద్లో గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.
1971 భారత్-పాక్ యుద్ధంలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పాటైన తర్వాత శాంతి స్థాపన కోసం 1972 జులై 2న సిమ్లాలో జరిగిన చర్చల్లో భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేసిన ఈ ఒప్పందం చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనిలో ప్రధానంగా సమస్యలన్నింటినీ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలనే నిబంధన ఉంది.
ఈ ఒప్పందంలో కీలక అంశం – 1971 కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖ (LOC)గా అంగీకరించడమే. దీన్ని ఏ దేశమూ ఏకపక్షంగా మార్చరాదని స్పష్టంగా పేర్కొనడం, మూడో పక్ష జోక్యాన్ని నిరాకరించడమే దీని విశిష్టత. ఐక్యరాజ్యసమితి చార్టర్ను గౌరవించాలి, పరస్పర ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం అనుసరించాలి అన్న నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి.
ఇప్పుడు ఈ ఒప్పందాన్ని పాక్ సస్పెండ్ చేయడమంటే, శాంతియుత పరిష్కార మార్గాలను తుడిచి పెట్టడమేనని భారత నిపుణులు అంటున్నారు. సరిహద్దు చర్చలపై దీని ప్రభావం పడే అవకాశముంది. పైగా భారత్ ఇప్పటికే పాక్ మిలిటరీ అటాషేలను బహిష్కరించిన నేపథ్యంలో, ఈ నిర్ణయం ఉద్రిక్తతలు మరింత పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇంతవరకు భారత్ అధికారికంగా స్పందించకపోయినా, ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో కొత్త ఆంక్షలకు, మరింత హక్కుల ఉల్లంఘనలకు తలుపులు తెరచే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శాంతి శకం పూర్తిగా ముగుస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు తీవ్రతరం అవుతోంది.