పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ప్రభావం ఇప్పుడు క్రీడారంగానికీ విస్తరించింది. పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, పాకిస్థాన్ జావెలిన్ త్రోర్ అర్షద్ నదీమ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను భారత్లో నిలిపివేయడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటివరకు సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఖాతాలనే బ్లాక్ చేసిన భారత్, ఇప్పుడు ఆటగాళ్లపై కూడా చర్యలు తీసుకోవడం గమనార్హం.
ఈ చర్యకు కారణం పాక్ నుంచి వస్తున్న విరోధాత్మక ప్రచారమని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మహీరా ఖాన్, హనియా ఆమిర్, అలీ జాఫర్, సజల్ అలీ, బిలాల్ అబ్బాస్, సనం సయీద్, ఇక్రా అజీజ్ వంటి ప్రముఖుల ఇన్స్టా ఖాతాలు భారత వినియోగదారులకు అనీ మేయంగా మారాయి. పాకిస్థాన్కు చెందిన మొత్తం 16 యూట్యూబ్ ఛానళ్లను కూడా కేంద్రం గత వారం నిషేధించింది. వీటిపై ‘భారత వ్యతిరేక’ కంటెంట్ను వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇదిలా ఉంటే, అర్షద్ నదీమ్ ఖాతాను బ్లాక్ చేయడం సంచలనంగా మారింది. పాక్కు చెందిన క్రీడారంగంలో ఇంటర్నేషనల్ గుర్తింపు పొందిన అథ్లెట్గా నదీమ్ పేరు వినిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్ అతని ఖాతాను బ్లాక్ చేయడం గమనార్హం. భారత వినియోగదారులు ఇప్పుడు అతని ఇన్స్టా పేజీని యాక్సెస్ చేయలేరు. ఇందులో ఆయన ట్రైనింగ్ వీడియోలు, క్రీడా అనుభవాలపై పోస్ట్లు ఉన్నాయి.
భారత ప్రభుత్వం ఇటీవల పాకిస్థాన్పై తీసుకున్న చర్యల్లో భాగంగా దౌత్యపరమైన, సాంకేతిక పరమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. సింధూ నదీ జలాలపై ఒప్పందాన్ని పునఃపరిశీలిస్తున్నట్టు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ వెల్లడించగా, పాక్ పౌరుల కోసం వీసాలపై కఠిన నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. అంతేకాదు, భారత గగనతలాన్ని పాక్ విమానాలకు మూసివేసే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.