Central Governament: దేశ భద్రత దృష్ట్యా, సైనిక కార్యకలాపాలు, భద్రతా బలగాల కదలికలపై ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు అందరూ ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
ప్రత్యక్ష ప్రసారాలు లేదా సున్నితమైన సమాచారం బహిర్గతం చేయడం వల్ల శత్రు మూకలకు సమాచారం చేరే ప్రమాదం ఉందని, ఇది భద్రతా దళాల ప్రాణాలకు ముప్పుగా మారవచ్చని కేంద్రం హెచ్చరించింది. ప్రత్యేకించి సైనిక చర్యలు జరుగుతున్న సమయంలో లైవ్ రిపోర్టింగ్, వర్గాల సమాచారం పేరిట వివరాలను వెల్లడించడం ప్రమాదకరమని పేర్కొంది. ఇలాంటి ఘటనల ఉదాహరణగా కార్గిల్ యుద్ధం, ముంబై 26/11 దాడులు, కాందహార్ విమాన హైజాక్ సందర్భాలను గుర్తు చేసింది.
ప్రత్యక్ష ప్రసారాల విషయంలో కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (సవరణ) నిబంధనలు-2021లోని రూల్ 6(1)(పి) ప్రకారం ఇప్పటికే నిషేధం అమలులో ఉందని మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది. భద్రతా ఆపరేషన్లు పూర్తయ్యే వరకు, ప్రభుత్వం నియమించిన అధికారుల ద్వారా మాత్రమే సమాచారం ప్రసారం చేయాలని స్పష్టంగా తెలిపింది.
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారు చట్ట ప్రకారం కఠినమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. మీడియా సంస్థలు తమ కవరేజ్లో అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని, జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఏ చర్యలకూ తావు ఇవ్వకూడదని సూచించింది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో సున్నితమైన పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాలు పరిరక్షించబడతాయని ప్రభుత్వం ఆశించింది. మొత్తానికి, దేశ రక్షణకు సంబంధించి మీడియా బాధ్యత మరింత పెరిగిందని స్పష్టమైంది.