తమతో కలవనందుకు కేసీఆర్ కి థాంక్స్!

అత్యంత రసవత్తరంగా ముగిసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న విడుదల కాబోతున్నాయి. అంతకుముందే ఎగ్జిట్ పోల్స్ హడావిడి మొదలైపోయింది. ఈ ఫలితాల లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి యావరేజ్ న 100 – 110 స్థానాలు, బీజేపీకి 80 – 90 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేలింది! అంటే… ఇంకా ఏపార్టీకీ పూర్తి స్థాయిలో మెజారిటీ రానట్లేనన్న మాట. అసలు ఫలితాలు వచ్చే వరకూ వీటిపైనే విశ్లేషించుకోవాలి కాబట్టి… అలా చూస్తే జేడీఎస్ కు 20 – 25 స్థానాలు పక్కా అని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఇతరులకు కూడా 1 – 5 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనంతరం కేసీఆర్ కి మనసులో థాంక్స్ చెప్పుకుంటున్నారంట కుమారస్వామి!

ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి 15 నుంచి 25 సీట్ల వ్యత్యాసం మాత్రమే ఉండొచ్చని తెలుస్తుంది. అంటే… ఇప్పటికి ఇంకా ఏ ప్రధాన పార్టీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే ఛాన్స్ లేనట్లే లెక్క. దీంతో… ఇక్కడ కాంగ్రెస్ – బీజేపీ లకు జేడీఎస్ అవసరం పుష్కలంగా ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ – బీజేపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నా… ఎవరు ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్నా… జేడీఎస్ అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట.

ఈ సమయంలో జేడీఎస్ – బీఆరెస్స్ లు కలిపి పోటీచేసినా ఫలితాలు ఇంతకంటే గొప్పగా వచ్చేవి కావంటున్నారు పరిశీలకులు. దీంతో… అప్పుడు జేడీఎస్ కు బీజేపీతో కలిసే ఛాన్స్ కానీ, కాంగ్రెస్ కు మద్దతు పలికే అవకాశం కానీ ఉండేది కాదు. కారణం… కేసీఆర్ కు బీజేపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పైగా కేసీఆర్ జాతీయ రాజకీయాలు ప్రధానంగా… బీజేపీయేతర ప్రభుత్వమే లక్ష్యంగా సాగుతున్నాయి.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే… ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తో బీఆరెస్స్ బిగ్ ఫైట్ కి సిద్ధమవుతుంది. సో… కర్ణాటక కాంగ్రెస్ తో బీఆరెస్స్ రాసుకుపూసుకు తిరగలేని స్థితి. సో… ఇప్పుడు జేడీఎస్ కు బీఆరెస్స్ తో ఆ సమస్య లేదు. అవకాశం ఉంటే కాంగ్రెస్, కాదంటే బీజేపీ… ఎవరితో అయినా కలిసిపోవచ్చు.. కండిషన్స్ ఒప్పుకున్న పార్టీతో హాయిగా అధికారాన్ని అనుభవించొచ్చు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న జేడీఎస్ అభిమానులు… తమతో కలవనందుకు, కలిసి నడవనందుకు కుమార స్వామి లోలోపల కేసీఆర్ కు థాంక్స్ చెప్పుకుంటున్నారని అంటున్నారట. లాజిక్కే…!