‘అసెంబ్లీని ముట్టడిస్తాం.. మీ జగన్ సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న పేల్చిన పవర్ పంచ్కి అట్నుంచి, తూటాల్లాంటి విమర్శలు దూసుకొచ్చాయి. ‘బోడి లింగాలన్నారు.. చిడతలు వాయించుకోమన్నారు..’ ఇంకేవేవో డైలాగులు పేల్చారు పవన్. మరి, అట్నుంచి కూడా అంతకు మించిన విమర్శలే వస్తాయ్ కదా. మంత్రి కొడాలి నాని అయితే, ‘ఆడు, ఈడు’ అంటూ విరుచుకుపడిపోయారు. ‘షకీలా సాబ్’ అంటూ పవన్పై సెటైర్లు వేశారు మంత్రి కొడాలి నాని. దాంతో, జనసేన నుంచి కూడా గట్టిగానే రివర్స్ కౌంటర్లు వస్తున్నాయ్. ‘పవన్ కళ్యాణ్ అన్నది నిజమే.. బోడి లింగాలు చాలానే వున్నాయ్.. మేమే బోడి లింగాలమంటూ చాలామంది వస్తున్నారు..’ అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తోంటే, ‘పావలా’ అనీ, ‘ప్యాకేజ్ స్టార్’ అనీ పవన్ కళ్యాణ్పై వైసీపీ నుంచీ సెటైర్లు పడుతున్నాయి.
చిత్రమైన విషయమేంటంటే, ఇక్కడ పవన్ని వైసీపీ నేతలు తిడుతున్న తిట్లను వైసీపీ అనుకూల మీడియా కాస్త తక్కువగానే ‘కవర్’ చేస్తోంది. టీడీపీ అనుకూల మీడియానే, ఒకింత ఎక్కువగా కవర్ చేస్తోంది. జనసేన పార్టీని రెచ్చగొట్టేదీ ఆ టీడీపీ అనుకూల మీడియానే.. జనసేన అధినేతను తిట్టించేది కూడా ఆ టీడీపీ అనుకూల మీడియానే. సరే, రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ఇప్పుడున్న రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు సహజాతి సహజం. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ, తమ అభిమానుల్ని కాపాడుకుంటుంది, ఇతర పార్టీలకు చెందిన అభిమానుల్ని లోపలేస్తుంది.
టీడీపీ హయాంలో వైసీపీ మీద కేసులు, వైసీపీ హయాంలో టీడీపీ మీద కేసులు.. పెద్దగా తేడాల్లేవ్. మంత్రుల మీద జనసేన అభిమానులు చేస్తోన్న వివాదాస్పద జుగుప్సాకరమైన ఆరోపణలపై కేసులు నమోదవడం ఖాయం. మరి, జనసేనాని మీద మంత్రులు జుగుప్సాకరమైన కామెంట్ల చేస్తున్నారు కదా.. వారి మీద కేసులుండవా.? అంటే, ఎందుకుంటాయ్.? అధికార పార్టీకి మాత్రమే పోలీసులు వత్తాసు పలుకుతారు కదా.. అన్నది ఇంకో వాదన. ఏదిఏమైనా, అప్పుడప్పుడూ రాజకీయ తెరపై అగ్రెసివ్గా కన్పించే పవన్ కళ్యాణ్కి ఇదంతా అవసరమా.? నాలుగు తిట్టి, నలభై నాలుగు తిట్టించుకుని.. ఎన్నాళ్ళీ టైమ్ పాస్ రాజకీయాలు.?