కృష్ణ నదిపై ఆల్మట్టి రిజర్వాయర్ నిర్మాణం తర్వాత నదిలో వరద ఆగస్టు నెలలో గాని రావడం లేదు. ఫలితంగా దిగువ రాష్ట్రాలకు నీటి ఎద్దడి సంవత్సరాల్లో ట్రిబ్యునల్ కేటాయింపులు ప్రకారం కూడా నీరు చేరడం లేదు.గత పది సంవత్సరాల గణాంకాలు పరిశీలించితే మూడు సంవత్సరాలు తప్ప మిగిలిన ఏడు సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బచావత్ కమిషన్ కేటాయించిన 811 టియంసిలు నీరు రాలేదు. . జూన్ జూలై మాసాల్లో వచ్చిన నీరు వచ్చినట్లు కర్నాటక ఎగువ భాగంలో వాడేసుకోవడం చాలా కాలంగా వివాదాశంగా వుంది. ఆల్మట్టిలో చేరుతున్న నీరును పలు ఎత్తిపోతల పథకాలు ద్వారా వాడేసుకొంటోంది.
ఒక పక్క సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో వుంది. మరో వేపు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ చేయ లేదు. కాని తాజాగా ఎగువ కృష్ణ మూడవ దశ పనులకు కర్నాటక ముఖ్యమంత్రి పది వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆల్మట్టి ఎత్తు 524.256 మీటర్లు పెంచేందుకు ముఖ్యమంత్రి యుడుయూరప్ప ఈ పథకానికి శ్రీ కారం చుట్టారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో వున్నా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో లేకున్నా ఆల్మట్టి ఎత్తు పెంచే పథకాన్ని నోటిఫై చేయమని కేంద్ర జల శక్తి శాఖను కర్నాటక ప్రభుత్వం కోరింది. ముఖ్యమంత్రి యుడుయూరప్ప కూడా కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం వుందని సులభంగా ఆమోదం పొంద వచ్చనే భావనతో వున్నట్లుంది. పైగా రాజకీయంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి యుడుయూరప్ప కాలు నిలదొక్కుకోవాలంటే ఆల్మట్టి ఎత్తు పెంచడం అనివార్యంగా వుంది. ఒక వేపు కేంద్రానికి లేఖ రాసి మరో వేపు నిధులు కేటాయించి పనులు ముమ్మరం చేస్తున్నా కేంద్ర జల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వుంది. ఇదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలకు మరణ శాసనం అవుతుంది.
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్న నేపధ్యంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాసిన లేఖ ఆధారంగా కేంద్ర జల శక్తి శాఖ మంత్రి వెంటనే స్పందించి డిపిఆర్ లు ఆమోదం పొందని రెండు రాష్ట్రాలకు చెందిన అన్ని ప్రాజెక్టుల నిర్మాణం ఆపు చేయమని వెను వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాని సుప్రీంకోర్టుతో పాటు ట్రిబ్యునల్ ముందు వివాదంలో చిక్కుకొని వున్న ఆల్మట్టి ఎత్తు పెంచే పథకం నిలుపుదల చేయమని కర్నాటక ప్రభుత్వాన్ని కేంద్ర జల శక్తి శాఖ కోరక పోవడం విశేషం. ఈ అంశంలో రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి నేతలు ఏలా స్పందించు తారో చూడాలి. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని పరిగణనలోనికి తీసుకున్నది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఈ అంశంపై ఎట్టి స్పందన వ్యక్తం కాలేదు. అసలే సాగునీటి రంగానికి నిధులు కేటాయింపుల్లో కోత విధించడం పైగా ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా వుండటం విదితమే.
గతంలో దేవగౌడ ప్రధానిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణంపై పెద్ద వివాదం నడచిన విషయం అందరికీ తెలుసు. అప్పట్లోనే ఈ వివాదం సుప్రీంకోర్టుకు ఎక్కింది. 516 అడుగుల వరకు ఎత్తుపెంచుకోవచ్చని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. సుప్రీంకోర్టు మాత్రం 519.684 అడుగుల ఎత్తు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చి 524.256 ఎత్తు పెంచే అంశం ట్రిబ్యునల్ కు వదిలేసింది. అప్పటి నుండి కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి లో 129.72 టియంసిల నీరు మాత్రం నిల్వ చేస్తోంది. పైగా అమర్చిన గేట్లను 519.168 ఎత్తు వరకు ఉంచి కట్ చేసింది. అయితే దురదృష్టం ఏమంటే తదనంతరం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా 524. 256 మీటర్లకు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ మరొక 130 టియంసిల నీరు కేటాయించినది. ఈ తీర్పు నోటిఫై జరగనందున ప్రస్తుతం బచావత్ కమిషన్ తీర్పుఅమలులో వుంది.
2004 లో నియమింప బడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో మధ్యంతర తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ఎగువ రాష్ట్రాలకు అనుకూలంగా వుందని కృష్ణ నదిలో మిగులు జలాలను కూడా పంపకం చేయడం దీనికి తోడు 65 శాతం నీటి లభ్యత తీసుకోవడం వీటన్నింటి మించి ఆల్మట్టి ఎత్తు 524. 256 మీటర్లకు పెంచుకొనేందుకు అనుమతి ఇస్తూ కర్నాటక కు 130 టియంసిల నీటి కేటాయింపులు చేయడంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ కేసు విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు తన వాదనను ట్రిబ్యునల్ ముందు వినిపించాలని ఆంధ్ర ప్రదేశ్ కు సూచించింది. తిరిగి 2013 లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ దాదాపు అదే విధంగా తుది తీర్పు వెలువరించింది.
మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం వున్న ఒక్క తెలుగు గంగ కు తప్ప మిగిలిన ఏ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేయ లేదు. ఈ తీర్పు పైతిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించి స్టే మంజూరు చేసింది. ఈ అన్ని కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టు లో పెండింగ్ లో వున్నాయి.
ప్రస్తుతం ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజకీయంగా రాష్ట్రంలో నిలదొక్కుకొనేందుకు ప్రజా వ్యతిరేకత నుండి బయట పడేందుకు ఎగువ కృష్ణ మూడవ దశ పనులకు పది వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు సిద్ధమైనారు. అదే సమయంలో కేంద్ర జల సంఘం ఆమోదానికి ప్రయత్నించుతున్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో వున్నందున ఈ వెసులుబాటు వినియోగించుకోవాలని చూస్తున్నారు. కేంద్ర జల సంఘం జల శక్తి శాఖ ఈ విషయంలో చట్ట విరుద్ధంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేస్తున్న యత్నాలను అడ్డుకోవడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల తగాదాలో స్పందించినట్లు చట్ట విరుద్ధంగా వున్న కర్నాటక ప్రతి పాదనలను త్రోసి పుచ్చడం లేదు. ఒక వేళ కేంద్ర జల సంఘం మూగ నోము పట్టితే దాన్ని అవకాశంగా తీసుకొని కట్ చేసిన గేట్లు తిరిగి 524. 257 అడుగు ఎత్తుకు పెంచుకొనే అవకాశం లేక పోలేదు. ఒక్క కర్నాటక రాష్ట్రమే కాదు. ఇటీవల కాలంలో పలు రాష్ట్రాలు అమలులో నిబంధనలను తుంగలో తొక్కి ముందుకు పోవడం సాధారణ అంశమైంది.
ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆల్మట్టి ఎత్తు పెంచితే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో లేకుండా సస్పెన్స్ లో వున్నా దాని తీర్పును బరితెగించి అమలు చేసుకున్నట్లవుతుంది. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్ట పోవలసి వుంటుంది. కర్ర గల వానిదే బర్రె చంద మౌతుంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల యెడల పక్ష పాతంతో వ్యవహరిస్తోంది. రాష్ట్ర విభజన తదుపరి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ పరిధి నాలుగు రాష్ట్రాల మధ్యనా? లేక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నా? అని సుప్రీంకోర్టు 2015 లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కొన్నాళ్లు నాన బెట్టిన కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ట్రిబ్యునల్ తన తీర్పు తిరిగి పరిశీలించే అవకాశం జారి పోయింది. అంతేకాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బలహీనతలను ఉపయోగించుకొని గోదావరి జలాలను తమిళనాడుకు తరలించుకు పోయే యత్నాలను కేంద్రం కొనసాగిస్తోంది. తాజాగా కర్నాటక ప్రతి పాదన అంశంలో ఏలా స్పందించు తుందో చూడాలి. ఆంధ ప్రదేశ్ ప్రభుత్వం మేలుకోకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన వలసి వుంటుంది. ముందుగా కేంద్ర జల శక్తి శాఖకు అభ్యంతరం తెలుపుతూ అదే సమయంలో తిరిగి సుప్రీంకోర్టులో కేసును సమర్థవంతగా నడప వలసి వుంది
