నాగర్ కర్నూల్ స్వాతికి మళ్లీ జైలే దిక్కా?

ప్రియుడి మోజులో పడి భర్త సుధాకర్ రెడ్డిని అతి కిరాతకంగా హతమార్చిన నాగర్ కర్నూల్ స్వాతి అందరికి గుర్తు ఉండే ఉంటుంది. జూలైలో బెయిల్ పై విడుదలైన నాగరు కర్నూల్ స్వాతి ప్రస్తుతం స్టేట్ హోమ్ లోనే ఉంది. నా అనేవారు ఆదరించక పోవడంతో ఏ తోడూ లేక అనాథలా స్వాతి ఉంది. బెయిల్ ఇచ్చిన వారు ఉపసంహరించుకుంటారని వార్తలు వచ్చినా న్యాయ పరమైన ఇబ్బందులు వచ్చి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుందనే కారణంతో వారు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

భర్త సుధాకర్ రెడ్డి, పిల్లలతో స్వాతి

నాగరు కర్నూల్ కు చెందిన స్వాతికి భర్త సుధాకర్ రెడ్డి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో స్వాతి ప్రియుడు రాజేష్ ఎంటర్ అయ్యాడు. స్వాతి రాజేష్ ల మధ్య ఏర్పడిన అక్రమ సంబంధం చివరకు సుధాకర్ రెడ్డిని హతమార్చే వరకు వెళ్లింది. సిని ఫక్కీలో నాటకీయంగా సుధాకర్ రెడ్డిని హత్య చేసి స్వాతి, రాజేష్ దొరికి పోయారు. భర్త సుధాకర్ రెడ్డిని స్వాతి హత్య చేసిన వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా స్వాతికి బెయిల్ లభించింది. బెయిల్ వచ్చినా తీసుకుపోయేందుకు ఎవరూ రాకపోవడంతో అనేక హైడ్రామాల మధ్య ఇద్దరు వ్యక్తుల పూచీతో స్వాతి బెయిల్ నుంచి విడుదలయ్యింది.

తన కూతురు చనిపోయిందని స్వాతి తండ్రి గుండు గీయించుకున్నాడు. స్వాతి కనిపిస్తే చంపేంత కోపంతో స్వాతి అత్తింటి వారున్నారు. ఏ దిక్కుమొక్కు లేకపోవడంతో స్వాతిని మహబూబ్ నగర్ మహిళా హోంకి తరలించారు. అయితే బెయిల్ ఇచ్చిన వారు ఉపసంహరించుకుంటామనడంతో స్వాతికి బెయిల్ రద్దు అయ్యి మళ్లీ జైలు తప్పదని అంతా భావించారు. బెయిల్ కి హామీ ఇచ్చి రోజుల్లోనే ఉపసంహరించుకుంటే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందనే భావనతో వారు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. స్వాతిని స్టేట్ హోంకి తరలిస్తారని అంతా భావించారు. కానీ స్వాతిని ప్రస్తుతానికి మహబూబ్ నగర్ మహిళా హోంలోనే ఉంచారు. స్టేట్ హోంకి తరలించకుంటే బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకే పంపే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.

క్షణికానందం కోసం భర్తను చంపి అందరూ ఉన్నా అనాథలా స్వాతి జీవితం తయారైపోయింది. స్వాతి చేసిన తప్పుకు తనకు జీవితాంతం క్షోభ తప్పేలా లేదు. తన పిల్లలను తన దగ్గరికి చేరిస్తే ఏదో ఒక పని చేసుకోని బతుకుతానని స్వాతి విలపిస్తుందని అక్కడి సిబ్బంది తెలిపారు. తను భర్తను చంపి చాలా పెద్ద తప్పు చేశానని, ప్రియుడు రాజేష్ దగ్గరికి వెళ్లనని వారితో స్వాతి తెలిపిందట. స్వాతి చేసిన తప్పుకు మానసిక క్షోభ అనుభవిస్తుందని ఎప్పుడు చూసినా ఒంటరిగానే గడుపుతుందని అక్కడి సిబ్బంది ద్వారా తెలుస్తోంది. నాగర్ కర్నూల్ స్వాతి ఉదంతం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని అంతా చర్చించుకుంటున్నారు.