Indian Army: భారత ఆర్మీలో రోబోలు.. డీఆర్‌డీఓ ఏం చెబుతోందంటే..

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) భద్రతా రంగంలో మరో సంచలనానికి తెరతీసింది. సరిహద్దు ప్రాంతాల్లో సైనికుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టకుండా ముఖ్య మిషన్లు పూర్తి చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన హ్యూమనాయిడ్ రోబోలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటి రూపకల్పన వెనుక ప్రధాన ఉద్దేశం.. మానవ ప్రమేయం తగ్గించడం, సైనికుల ప్రాణాలను రక్షించడం.

ఈ రోబోలు మనిషి తరహా శరీర నిర్మాణంతో ఉండటం విశేషం. ఫ్రంట్‌లైన్‌లో సైనికులు ఎదుర్కొనే ప్రతికూల వాతావరణాలను తట్టుకోగల సామర్థ్యం వీటికి ఇవ్వబడుతోంది. గుట్టలు, అటవీ ప్రాంతాలు, రాళ్ల పొరల మీద కూడా సమర్థంగా కదలగల వీటి కాళ్ల నిర్మాణం ప్రత్యేకంగా రూపుదిద్దబడింది. “ఆపరేటర్ల నుంచి వచ్చే ఆదేశాలను అర్థం చేసుకుని కచ్చితంగా అమలు చేయగలవు” అని ప్రాజెక్ట్‌పై పని చేస్తున్న ఇంజినీర్లు తెలిపారు.

డీఆర్‌డీఓ ఇప్పటికే ఈ రోబోలపై కీలక పరీక్షలు నిర్వహించి, ప్రాథమిక విజయాలు సాధించిందని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా, ఈ రోబోలు తుపాకీ కాల్పులు ఎదుర్కొని లక్ష్యాలను చేరుకోవడం, నిఘా పనులు చేయడం వంటివి పూర్తిచేశాయి. తదుపరి దశలో వీటి ఆలోచన సామర్థ్యాన్ని, శత్రువుల వ్యూహాలను గుర్తించే సాంకేతికతను పెంచే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు.

2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, భారత సైన్యంలో చేరుస్తామని డీఆర్‌డీఓ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే జరిగితే, భారత భద్రతా వ్యవస్థలో ఇది ఒక పెద్ద మైలురాయి అవుతుంది. రోబోటిక్ సైన్యం సపోర్ట్‌తో సరిహద్దు భద్రత మరింత పటిష్టం కానుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇకపై యుద్ధభూముల్లో మన సైనికులకు తోడుగా, క్రమంగా హ్యూమనాయిడ్ రోబోలు కూడా నిలవబోతున్నాయి. సాంకేతికతతో భారత రక్షణ శక్తి ఒక అడుగు ముందుకు వేస్తోంది.

Kakinada Women Shocking Reaction On Operation Sindoor | AP Public Talk | Pakistan | Telugu Rajyam