Harish Rao: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలేనని, ఆ రెండు పార్టీల మధ్య ‘గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ’ నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుర్తికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు వారికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రభుత్వమే ప్రజలకు బాకీ పడింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ప్రభుత్వమే ప్రజలకు బాకీ పడిందని ఎద్దేవా చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను.. “మా బాకీ పైసలు ఎప్పుడు ఇస్తారు?” అని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణకు బీజేపీ మొండిచెయ్యి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే, రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేలేకపోయారని విమర్శించారు. పక్క రాష్ట్రాలకు కేంద్రం వేల కోట్లు కేటాయిస్తుంటే, తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల వెనకబాటుకు కారణమవుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని కోరారు.
హైదరాబాద్ వెలవెలబోతోంది కేసీఆర్ హయాంలో కళకళలాడిన హైదరాబాద్ నగరం, రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల వెలవెలబోతోందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా కూల్చివేతలు, ఇతర నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారని దుయ్యబట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

