‘బండి’ స్పీడుకి బ్రేకులు: తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయం.!

Group politics in Telangana BJP

బండి సంజయ్.. తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు తెచ్చిన నాయకుడు. చాలా అగ్రెసివ్‌గా వుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. అందుకేనేమో, బీజేపీ జాతీయ నాయకత్వం.. ఆయన్ని ఏరికోరి ఎంపిక చేసింది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో బండి సంజయ్ వ్యూహం ఫలించింది. దాంతో, తెలంగాణ బీజేపీకి సంబంధించి బండి సంజయ్ తిరుగు లేని నేతగా మారారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కంటే ఎక్కువ పాపులారిటీ ఇప్పుడు బండి సంజయ్ సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే, అనూహ్యంగా తెలంగాణ బీజేపీలో ఇప్పుడు గ్రూపు రాజకీయాలు షురూ అయ్యాయి. బండి సంజయ్ ప్రాపకం కోంస కొందరు, బండి సంజయ్ మద్దతుతో మరికొందరు.. పార్టీని భ్రష్టుపట్టించేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల ప్రాబల్యమే ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటివాళ్ళంతా గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు తమ రాజకీయ ఎదుగుదల కోసం. ఈ వ్యవహారంలో బండి సంజయ్ టార్గెట్ అయిపోతున్నారు.

Group politics in Telangana BJP
Group politics in Telangana BJP

ఫలానా గ్రూపుకి బండి సంజయ్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారంటూ ఇంకొన్ని గ్రూపులు గుస్సా అవుతున్నాయి. ఏ రాజకీయ పార్టీలో అయినా ఇలాంటివి మామూలే అయినా, ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఎదుగుతోన్న బీజేపీకి ఈ గ్రూపు రాజకీయాలు మాత్రం అడ్డంకిగా మారతాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలు, బీజేపీ నుంచి వచ్చిన నేతలు, టీడీపీ నుంచి వచ్చిన నేతలు.. ఇలా బీజేపీలో పలు గ్రూపులు చాలా యాక్టివ్ అవుతున్నాయి. ఈ క్రమంలో అసలు బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారుతోంది పరిస్థితి. ఈ ఎఫెక్ట్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ఖచ్చితంగా వుంటుందనేది నిఖార్సయిన బీజేపీ నేతల వాదనగా కనిపిస్తోంది. అయితే, బీజేపీల్ ఆల్ ఈజ్ వెల్ అంటున్నారు బీజేపీ తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్. గ్రూపులేమీ తమ పార్టీలో లేవనీ, అందరూ కలిసి కట్టుగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారన్నది బండి సంజయ్ వాదనగా కనిపిస్తోంది.