బీజేపీ ఉచ్చులో కేసీఆర్ పడిపోయారా? 

KCR and BJP in GHMC polls
బహుశా …తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా బీజేపీని చూసి భయపడుతున్నట్లు నిన్న జరిగిన  బహిరంగ సభలో  ఆయన చేసిన ఉపన్యాసం స్పష్టం చేస్తున్నది.  బీజేపీ చేతిలో నగరాన్ని పెడితే మతకలహాలు చెలరేగుతాయని, భూముల విలువలు పడిపోతాయని హెచ్చరించారు. 
 
KCR and BJP in GHMC polls
BJP for the first time appears as strong contestant in GHMC polls
విచ్ఛిన్నకరశక్తులు శక్తులు హైద్రాబాద్ లో మాటు వేశాయని ముఖ్యమంత్రి చెప్పగానే పోలీసు కమీషనర్లు అందరూ ఆ మాటను ధృవీకరించారు.  అలాగే పాతబస్తీలో రోహింగ్యాలు అక్రమంగా తిష్ట వేశారని బండి సంజయ్ ప్రకటించగానే రాచకొండ పోలీస్ కమీషనర్ ఆ ఆరోపణను నిజమే అని ప్రకటించారు.  మరి ఇన్నాళ్లుగా అక్రమంగా రోహింగ్యాలు నగరంలో తిష్టవేసి ఆధార్ కార్డులు కూడా సంపాదిస్తే ప్రభుత్వం, పోలీసులు ఏమి చేస్తున్నట్లు అని ప్రజలు నిలదీస్తున్నారు.  ఇది ప్రభుత్వ వైఫల్యమే అని నిందిస్తున్నారు.  
 
ఇన్నాళ్లుగా మజ్లీస్ పార్టీ, తెరాస పార్టీ కుమ్మక్కు అయ్యాయని అందరూ విశ్వసిస్తున్నారు.  నిజాం నవాబులను కేసీఆర్ పదేపదే పొగుడుతుంటారు.  అయితే మొన్నటి దుబ్బాక ఉప ఎన్నిక తరువాత బహిరంగంగా సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకునే బీజేపీ, మజ్లీస్ పార్టీల మధ్య రహస్య అవగాహన ఉన్నదని ఒక  బాంబు పేలింది.  నిజంగా అలా జరుగుతుందా అని ప్రజలు విస్తుపోయారు.  కానీ, కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే  వాస్తవంగానే ఆ రెండు మత పార్టీల మధ్య రహస్య మైత్రి ఉన్నదేమో అని సందేహం కలుగుతుంది.  బీహార్ లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో హైద్రాబాద్ లోని మజ్లీస్ పార్టీకి అయిదు శాసనసభ స్థానాలు దక్కడం వెనుక బీజేపీ మద్దతు ఉందని ప్రజలు ఇప్పుడు సందేహిస్తున్నారు.  
 
కేవలం నగరస్థాయికి పరిమితమైన కార్పొరేషన్ ఎన్నికల్లో జాతీయ అంతర్జాతీయ విషయాలు కూడా ప్రస్తావనకు రావడం ఆశ్చర్యకరం.  దానికితోడు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చే ధైర్యం ఉన్నదా అని మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి సవాలు విసరడం, వెనువెంటనే బీజేపీ అధ్యక్షుడు సంజయ్ “మేము దారుస్సలాం (మజ్లీస్ పార్టీ కేంద్ర కార్యాలయం) కూల్చేస్తాం” అని ప్రతిసవాల్ విసిరాడు.  అవి జరగవు అని అందరికీ తెలుసు.  కానీ, మజ్లీస్ పార్టీ వారు  రెండు తెలుగు రాష్ట్రాలవారు ఎంతో అభిమానించే ఇద్దరు మహానాయకులు సమాధులు కూల్చుతామని తొడగొట్టినపుడు టీఆరెస్ పార్టీ స్పందించకపోవడం, బీజేపీ వెంటనే స్పందించడం హిందూవాదుల మనోభావాలను బీజేపీ వైపు మార్చివేసే అవకాశాన్ని కొట్టిపారేయలేము. 
 
మజ్లీస్ పార్టీకి బీజేపీ మాత్రమే జవాబు ఇవ్వగలదు అని ప్రజలు భావించేట్లుగా ఈ సంఘటన రూపుదిద్దుకోవడం వెనుక బీజేపీ, మజ్లీస్ పార్టీల వ్యూహమే కారణం అని పరిశీలకుల భావన.  బీజేపీ జాతీయస్థాయిలో బలంగా ఉండటమే కాక, అధికారంలో కూడా ఉండటంతో స్థానిక టీఆరెస్ తో మైత్రి కన్నా, బీజేపీతో పొత్తు తమకు లాభదాయకం అని మజ్లీస్ పార్టీ అభిప్రాయం అంటున్నారు.  అందుకే ఏదో రకంగా హిందువులను రెచ్చగొట్టి బీజేపీ వైపుకు తిప్పడమే అక్బరుద్దీన్ విసిరే సవాళ్ల వెనుక ఆంతర్యం అని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.  పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ ప్రకటించడం వెనుక కూడా ముస్లిమ్స్ ఓట్లు చీలకుండా గంపగుత్తగా మజ్లీస్ కు వేయించడమే బీజేపీ లక్ష్యం.  ఈ విధంగా ఆ రెండు మతతత్వ పార్టీలు తమ మతస్తుల ఓట్లు చీలిపోకుండా ముస్లిమ్స్ అందరూ మజ్లీస్ వైపు, హిందువులు అందరూ బీజేపీ వైపు మొగ్గేట్లు చెయ్యడానికి ఆ రెండు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని చాలామంది అభిప్రాయం.  
 
ఇప్పటివరకూ ఉపఎన్నికలు అంటే మంచినీళ్లు తాగినంత తేలికగా తీసుకున్న టీఆరెస్ మొన్నటి దుబ్బాక దెబ్బ తరువాత ఎన్నికలు అంటే భయపడే స్థితికి వెళ్ళింది. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర నాయకులు, మంత్రులు సైతం దిగుమతి అవుతుండటంతో కేసీఆర్ లో వెరపు కలిగిందని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.  అయితే నగర పాలక ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠం దక్కినంతమాత్రాన కేసీఆర్ కు వచ్చే నష్టం ఏమీ ఉండదు.  ఆయన అధికారానికి భంగం వాటిల్లదు.  కానీ,ఇరవై అయిదు ఎమ్మెల్యే స్థానాల మీద ప్రభావం చూపించే నగర పాలక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందంటే మాత్రం టీఆరెస్ కు ప్రమాదఘంటికలు మోగినట్లే అని చెప్పుకోక తప్పదు.