MAVIGUN – Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతి కంటే ‘మావిగన్’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) కారిడార్ అత్యుత్తమ ఆప్షన్ అని ఆయన పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏమిటీ ‘మావిగన్’ (MAVIGUN) ప్రతిపాదన? రాజధానిపై తమకు స్పష్టమైన ప్రణాళిక ఉందని జగన్ వివరించారు.
ప్లాన్ ఏ: పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి.
ప్లాన్ బి (మావిగన్): మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ 110 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్ను అభివృద్ధి చేయడం.
“అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ. 2 కోట్లు ఖర్చవుతుంది. మొదటి విడతలోనే లక్ష కోట్లు అవసరం. అంత ఖర్చు చేసే బదులు, అందులో కేవలం 10 శాతం మావిగన్ కోసం ఖర్చు చేస్తే అద్భుతమైన సౌకర్యాలు వస్తాయి” అని జగన్ పేర్కొన్నారు.

అమరావతిపై తీవ్ర విమర్శలు : చంద్రబాబు అమరావతిపై ఎందుకు పట్టుబడుతున్నారో జగన్ విశ్లేషించారు. “అమరావతి చంద్రబాబుకు ఒక దోపిడీ గని. కాంట్రాక్టుల ద్వారా కమీషన్లు దండుకోవడమే ఆయన ప్లాన్. అమరావతి పేరుతో రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటూ కాలయాపన చేస్తూ రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేస్తున్నారు” అని మండిపడ్డారు.
గడిచిన రెండేళ్ల కూటమి పాలనలో అన్ని రంగాలు విధ్వంసమయ్యాయని జగన్ ఆరోపించారు.
# వైఎస్సార్సీపీ ఐదేళ్లలో రూ. 3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ. 2.73 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి (DBT) వేశామన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 3.52 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ప్రశ్నించారు.
# తల్లి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ఇసుక, మద్యం, మట్టి మాఫియాలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు.
# వచ్చే ఏడాది ‘పాదయాత్ర’ ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధమని ప్రకటించిన జగన్, వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాదయాత్ర మొదలయ్యాక చంద్రబాబు ప్రభుత్వానికి అసలైన సినిమా చూపిస్తామని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

