Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. లోక్సభ తర్వాత గురువారం రాజ్యసభలోనూ ఈ బిల్లు నెగ్గడంతో అమరావతికి తిరుగులేని చట్టపరమైన హోదా లభించిందని, ఇది ప్రజల ఆత్మగౌరవ పునరుద్ధరణ అని ఆయన అభివర్ణించారు.
ఈ చారిత్రక పరిణామంపై పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అత్యంత భావోద్వేగంతో స్పందించారు.
“త్యాగాల పునాదుల నుంచి, ఆశలు మోసుకొచ్చిన కన్నీటి నుంచి, అనిశ్చితిని భరించిన నిశ్శబ్దం నుంచి అమరావతి నేడు కోట్లాది ప్రజల ఆశలను మోస్తూ గౌరవంగా నిలబడింది. గత కొన్నేళ్లుగా రాజధాని ఉనికిపై సాగిన కుట్రలు, అపోహలను అధిగమించి పార్లమెంట్ సాక్షిగా అమరావతి ఒక అజేయ శక్తిగా అవతరించింది.”- పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి

అమరావతి కోసం రైతులు చేసిన త్యాగాలను పవన్ కొనియాడారు. రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాలకు పైగా భూములను రైతులు ఎవరి బలవంతం మీదనో ఇవ్వలేదని, రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకంతో ఇచ్చారని గుర్తు చేశారు. ఈ చట్టబద్ధత ద్వారా రైతుల నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోగలిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఆయన నివాళులు అర్పించారు.

గత ప్రభుత్వ హయాంలో అమరావతిని అనిశ్చితిలోకి నెట్టి, విధానాలు మార్చి ప్రజలను మోసం చేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆ చీకటి రోజులకు తెరపడిందన్నారు. స్పష్టమైన దార్శనికతతో అమరావతి అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్రానికి ప్రతి దశలోనూ అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇకపై అమరావతి స్థిరత్వం మరియు ప్రగతికి చిహ్నంగా నిలుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం భవనాల సముదాయం మాత్రమే కాదని, తరతరాలకు వారధిగా నిలిచే ‘ప్రజల రాజధాని’ అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

