Revanth Reddy: ఆర్టీసీ సమ్మెకు బ్రేక్ వేసిన రేవంత్.. పరిష్కారం కోసం స్పెషల్ కమిటీ!

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టాలన్న సమ్మెకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగడంతో, మంగళవారం అర్థరాత్రి ప్రారంభం కావాల్సిన సమ్మెను కార్మిక సంఘాలు వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నాయి. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు హామీగా ఇచ్చిన ఫిట్‌మెంట్, ఇతర ప్రయోజనాల అమలుపై నెలలుగా కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ, స్పష్టత లేకపోవడంతో సమ్మె తలపెట్టారు. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలు, ముఖ్యంగా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు చర్చలకు ఆహ్వానం తెలియజేయడం కార్మిక సంఘాలపై ప్రభావం చూపింది.

ఇక మరోవైపు, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణసాగర్‌లతో కూడిన ఈ కమిటీ కార్మికుల సమస్యలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. ఈ విషయాన్ని చర్చల సందర్భంగా మంత్రి పొన్నం ప్రస్తావించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కార్మిక సంఘాలు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించాయి. ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న దృష్ట్యా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉండటం వల్ల సమ్మెను ముందుగా నిలిపివేయడం మంచి పరిణామంగా నిలిచింది.

లిక్కర్ స్కాం లో టీడీపీ ఎంపీ || Congress Tulasi Reddy On Kesineni Nani vs Kesineni Chinni || TR