Chandrababu : కూటమి ప్రభుత్వంలో నేతలు, కార్యకర్తల ప్రవర్తనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల పట్ల తీవ్ర మనస్థాపం వ్యక్తం చేశారు. నేతలు చేసే చిన్న తప్పు కూడా ప్రభుత్వంపై ప్రభావం చూపుతుందని, అందరూ బాధ్యతగా మెలగాలని హెచ్చరించారు.
“మనం చేసేది సుపరిపాలనా యజ్ఞం” రాష్ట్రంలో మనం సుపరిపాలన అందిస్తున్నామని, ఈ తరుణంలో నేతలు అదుపు తప్పి వ్యవహరిస్తే తనకు బాధ కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
నేతలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలి. ప్రజలతో సౌమ్యంగా ఉండాలి అని. అధికారం ఉందని అహంకారంతో వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ నష్టం తప్పదు. గత పాలకుల గర్వాన్ని చూసి ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో గుర్తుంచుకోవాలి అని ఆయన అన్నారు.
ఫ్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల దగ్గర గొడవలు పడి పార్టీ పరువు తీయొద్దని ముఖ్యమంత్రి గారు మందలించారు.
వైసీపీపై ధ్వజం: “మనది వికాసం – వాళ్లది విధ్వంసం” ప్రతిపక్ష వైసీపీపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేసిన ‘గొడ్డలి పార్టీ’, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.

“మనం చేసే అభివృద్ధిని, వాళ్లు చేసిన అవినీతిని నిత్యం ప్రజలకు వివరించాలి. మనం కాస్త రిలాక్స్ అయినా వాళ్ల అబద్ధాలు ప్రపంచమంతా తిరుగుతాయి. అందుకే కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.”
కూటమి సమన్వయంపై కీలక సూచనలు జనసేన, బీజేపీలతో సంబంధాల గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. “నేను, పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కని సంబంధాన్ని కొనసాగిస్తున్నాం. ఇదే స్నేహం క్షేత్ర స్థాయిలో కార్యకర్తల మధ్య కూడా ఉండాలి” అని అన్నారు. కేంద్రంతో రాష్ట్రానికి ఎలాంటి గ్యాప్ లేదని, రాకూడదని చెప్పారు. బీజేపీ నేతలను కూడా కలుపుకుని వెళ్లాలని సూచించారు.
వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు అని ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టి హెచ్చరిక జారీ చేశారు. “వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఉండొద్దు.. మళ్లీ మళ్లీ గెలవాలంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. తాను లేకుండా ఎంపీ రాకూడదని ఎమ్మెల్యేలు అనడం సరైన పద్ధతి కాదు. ప్రోటోకాల్ విషయంలో, సెక్యూరిటీ విషయంలో అనవసర వివాదాలకు పోయి మీడియాలో హెడ్డింగులకు ఎక్కొద్దు” అని స్పష్టం చేశారు.

