చంద్రబాబు పై సిబిఐ కేసులు  కమ్ముకుంటున్నాయా?

గత సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే రాష్ట్రంలో సిబిఐ విచారణలకు జనరల్ పర్మిషన్ ఇవ్వకూడదని……

40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడికి ……..సిబిఐ వ్యవస్ధ ఏర్పాటు, దాని పరిధులపై అధ్యయనం చేయించవలసిన అవసరం ఒక  (అ)శుభ సందర్భంలో ఏర్పడింది. సిబిఐ ని మన రాష్ట్ర పరిధిలోకి రాకుండా చేయడానికి ఒక చిన్న ఆర్డర్ తీస్తే సరిపోతుందని ఆయన తెలుసుకున్నారు. సవరణకు నోచుకోని మన బూజు పట్టిన చట్టాలు ఆయనకు వజ్రాయుధంలా కనిపించాయి. ఢిల్లీ పోలీసు యాక్టు కింద ఏర్పడిన సీబీఐ వ్యవస్ధ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ “జనరల్ కన్ సెంట్” ఉండాలన్నది చిన్న క్లాజు. ఆ క్లాజు చంద్ర బాబు కు మంచి అస్త్రంలా దొరికింది. నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో 14 ఏళ్ల ముఖ్య మంత్రి జీవితంలో ఆయనకు లభించిన సంజీవని ఈ  ఏక  వాక్య క్లాజు. 

జనంలో సిబిఐ విచారణ అంటే ఎంతో నమ్మకం. ఎన్నో దశాబ్దాలుగా సిబిఐ గొప్ప దర్యాప్తులు చేసి, ఎంతో మంది దుర్మార్గులకు వారు ఎంత గొప్పవారైనా శిక్షలు పడేలా చేసింది. అటువంటి సిబిఐపై తనకు విశ్వాసం లేదని నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అయిన చంద్ర బాబు నాయుడు ఎందుకు ప్రకటించవలసి వచ్చింది? సిబిఐ తన  రాష్ట్ర సరిహద్దులలోకి రానివ్వకుండా ఎందుకు చేయవలసి వచ్చింది?

అది 2018  మార్చి: అంత వరకు తాను అంటకాగిన మోడీ ప్రభుత్వంతో చంద్ర బాబు నాయుడు తెగతెంపులు చేసుకున్నారు. మరో ఏడెనిమిది నెలల తరవాత   తెలుగు దేశం నాయకులపై సిబిఐ తో సహా సెంట్రల్ ఏజెన్సీలు దాడులు చేశాయి. మోడీ వేసిన ఎత్తుకు పై ఎత్తులు వేసిన చంద్రబాబు చిన్న ఆర్డర్ తో సిబిఐని రాష్ట్ర విచారణకు రాకుండా అడ్డుకున్నారు.

మోడీని కాదనుకుని రాహుల్ తో జత  తర్వాత  బాబు సిబిఐకి అడ్డు కట్ట వేశారు. అంతకు  ముందు ఏమైంది? చంద్రబాబు సిబిఐకి ఎందుకు పగ్గం వేశారు?

చంద్ర బాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన బడా వ్యాపారవేత్త సతీష్ సనా సిబిఐ ఉన్నతాధికారులకు లంచం ఇవ్వజూపిన విషయం బయటపడింది.

అదే సమయంలో చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ నాయుడి అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ రిటైర్డు జడ్జి కె శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నారా చంద్రబాబు నాయుడు పై కేసులు

*  పెట్టుబడుల పేరుతో బోగస్ ఎంవోయూలు చేసుకుని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్  21  వేల కోట్లు రూపాయలు సంపాదించారని ఆ పిటిషన్ లో ఉన్నది. మరిన్ని వివరాలు కావాలంటూ కోర్టు ఆ పిల్ ను కొట్టివేసింది.   

* చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఆస్తులపై  20013  లో హైకోర్టు సీబీఐ  ప్రాధమిక విచారణకు ఆదేశించింది.

నారా లోకేష్ పై...

*  ఆంద్ర ప్రదేశ్ లో 80  ఎకరాల ప్రభుత్వ భూమిని నారా లోకేష్ ఆక్రమించుకున్నారని అదే సంవత్సరం సిబిఐకి ఫిర్యాదు అందింది. విచారణకు కోర్టు అనుమతి తీసుకోవలసిందిగా సిబిఐ పిటిషనర్లను కోరింది. ఈ కేసు ఇంకా పెండింగులో ఉంది.  

* నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణికి 2011  లోనే సిబిఐ నోటీసులు అందాయి. అది ఎమ్మార్ ప్రాపర్టీస్ లో విల్లా కొనుగోలుకు సంబంధించినది.

అప్పటి టిడిపి ఎంపీ సీఎం రమేష్ పై…. 

* అప్పటి టిడిపి ఎంపీ సీఎం రమేష్ ఇళ్లపై ఆఫీసులపై ఐటి, ఇడి దాడులు జరిగాయి. 

సిబిఐ రికార్డులలో ఇన్ని నల్ల మచ్చలు గల చంద్రబాబు నాయుడు తన పరిపాలన కాలంలో చివరి కొన్ని నెలలు సిబిఐని రాష్ట్రంలో విచారణలు చేయకుండా అడ్డుకున్నారు. కోర్టులలో పెండింగులో ఉన్న కేసులు ఇప్పుడు తుది విచారణకు వస్తే? సీబీఐ పాత ఫైళ్లను తిరగదోడాల్సిన పరిస్థితి వస్తే? జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారికే తప్పని జైలు శిక్షలు చంద్రబాబు నాయుడుని ఆహ్వానిస్తే? కాగల కార్యం ఎలా ఉంటుందో న్యాయ నిపుణులు, జ్యోతిషులే చెప్పాలి.

—- శాంతారామ్, సీనియర్ జర్నలిస్టు