మూడు రాజధానుల బిల్లుకు, సిఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ రాజముద్ర వేయడంతో చిన్న చిన్న సస్పెన్స్ లు అన్నీ ఎగిరిపోయాయి. రాజధాని మార్పుపై కేంద్రం వైఖరి ఏమిటన్నది రాష్ట్ర స్థాయి బీజీపీ నాయకులకే స్పష్టంగా తెలియని ఒక అయోమయ అవస్ధలో ఇప్పుడొక స్పష్టత వచ్చింది. ఈ అంశాన్ని తేల్చడానికి ఇంకా హైకోర్టు, సుప్రీం కోర్టు ఉన్నాయన్న ఆశ తెలుగుదేశం వర్గాల్లో మినుకు మినుకు మంటోంది. ప్రధాన రాజధాని విశాఖకు తరలిపోవడానికి అన్నీ సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి 15 న జెండా వందనం వైజాగ్ లోనే చేస్తారని చెబుతున్నారు.
అమరావతి రైతులకు ఆశాభంగం కలిగించారని నిందను మోస్తున్న చంద్రబాబు, అమరావతికి తెలిసో తెలియకో చరిత్రలో స్ధానం లేకుండా చేశారన్న తప్పును కూడా మీద వేసుకోవలసి ఉంటుంది. హడావుడిగా అమరావతిని రాజధానిగా ప్రకటించి, ఆ పెద్ద గ్రామానికి పాతిక కిలోమీటర్ల దూరంలో శుద్ధ పల్లెటూర్ల మధ్య రాజధాని తాత్కాలిక భవనాలను నిర్మించిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసి గెజిట్ కు ఎక్కించ లేదు. ఇది ఆయన చేసిన తప్పేనని అప్పటి సీనియర్ అధికారులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ టెక్నీకల్ గా అమరావతి ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కాదు. అన్నేళ్లపాటు అధికారంలో ఉండి, సమయమంతా రాజధాని నిర్మాణానికి వెచ్చించి, ఇందుకోసం తన భజన బృందంతో అనేక దేశాలు తిరిగి వచ్చి, అక్కడి రాజధానుల నిర్మాణ తీరులపై అధ్యయనం చేసి వచ్చారాయన. ఇల్లంతా అలికిన ఇల్లాలు ఇంటిపేరు మరిచినట్టు ఆయన అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడం (తన సౌకర్యార్ధం) మరిచిపోయారు. ఈ లోపు ఎన్నికలు జరిగిపోయి, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇది చంద్రబాబు నాయుడు తెలిసి చేసిన తప్పేనని అయన వద్ద పనిచేసి, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్న ఒక విశ్రాంత అధికారి చెప్పారు. కొత్త రాజధానిపై నోటిఫికేషన్ ఇస్తే, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పదేళ్ల పాటు వాడుకునే అవకాశం కోల్పోతామని యనమల వంటి మేధావో, మరొక న్యాయ కోవిదుడో ఆయనకు సలహా ఇచ్చి ఉంటారని ఆ అధికారి అన్నారు. 30 వేల ఎకరాలలో, అంతర్జాతీయ నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని ఊదరగొట్టిన చంద్రబాబు ఎప్పటికైనా వదలాల్సిన హైదరాబాద్ కోసం కక్కుర్తి పడడమెందుకు? పోనీ ఆయన తాత్కాలిక రాజధానిగా హైదరాబాద్ ను వాడుకున్నారా అంటే అదీలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అధికారికంగా అమరావతి కాదన్న విషయం సర్వ్ ఆఫ్ ఇండియా మ్యాప్ విడుదల చేసే వరకు తెలియలేదంటే ఎంత తమాషా జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. రాజధాని పేరుపై, హద్దులపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం మర్చి పోయామని, మ్యాప్ లో అమరావతిని చేర్చమంటూ ఆనాడు ప్రధాని మోడీని చంద్రబాబు వేడుకుంటే కొన్ని రోజుల తర్వాత మ్యాప్ లో స్ధానం దొరికింది కానీ, అమరావతి ఇప్పటికీ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కాలేకపోయింది.
పదేళ్ల పాటు దబాయించి హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిని షేర్ చేసుకునే అవకాశాన్ని లేకుండా ఒక చారిత్రిక తప్పిదాన్ని చేసిన చంద్రబాబు, అమరావతిని రాజధానిగా నోటిఫై చేయకుండా మరో పెద్ద తప్పు చేశారు. అమరావతిని ఆవిధంగా నోటిఫై చేసి ఉంటే రాజధాని మార్పు అంత సులభమై ఉండేది కాదని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అంటున్నారు.
—-శాంతారామ్
