Rahul Gandhi: ఓటింగ్‌లో మ్యాజిక్ ఏంటి? రాహుల్ గాంధీ ఆరోపణలపై దుమారం!

Rahul Gandhi: భారత ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలు దేశీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ గాంధీ, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఉదాహరణ చూపుతూ, ఓటింగ్ ప్రక్రియలో భౌతికంగా అసాధ్యంగా అనిపించే విషయాలు ఉన్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. “సాయంత్రం 5:30కి ఓటింగ్ శాతం వెల్లడించాక, 7:30కి 65 లక్షల ఓట్లు అదనంగా ఎలా వచ్చాయి?” అని ప్రశ్నించారు. ఓటరుకి ఓటు వేయడానికి కనీసం 3 నిమిషాలు పడుతుందని ఆయన వివరించారు.

ఈ విషయమై వీడియోగ్రఫీని కోరితే ఈసీఐ నిరాకరించిందని, మరింతగా వెళ్లి, అటువంటి సమాచారం అడగలేని విధంగా చట్టాన్ని సవరించిందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగా ఇలాంటి మార్పులు జరిగాయా? ఈసీఐలో పారదర్శకత సవాలుగా మారిందా?

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ మాట్లాడుతూ, విదేశాల్లో భారత్ ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి చెప్పడమే రాహుల్ ధోరణిగా మారిందన్నారు. “ఇది ‘భారత్ బద్నాం యాత్ర’ వంటిదే,” అంటూ విమర్శించారు. భారత ఎన్నికల వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. ఈ దుమారానికి కేంద్రంగా మారిన ఈ అంశం ఇప్పుడు రాజకీయపరంగా పెద్ద చర్చకు దారితీసింది. రాహుల్ ఆరోపణలపై ఈసీఐ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

అబద్దాల రాజమౌళి || Director Geetha Krishna Reveals SSMB29 Secrets || Mahesh Babu || Raja Mouli || TR