వ్యవస్థల నడుమ యుద్ధమా?  

Battle between AP Assembly and AP High Court
గౌరవ హైకోర్టు న్యాయమూర్తులను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల పట్ల రాష్ర సిఐడి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని,  న్యాయవ్యవస్థకు ప్రభుత్వం అండగా నిలబడటం లేదని, న్యాయమూర్తులను అవమానపరుస్తున్నారని, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, నిన్న హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా మండిపడటం మళ్ళీ వ్యవస్థల మధ్య సెగలను రాజేసింది.  ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధమైన శాసనవ్యవస్థను, కార్యనిర్వాహక వ్యవస్థను కూడా అవమానపరిచే విధంగా ఉన్నాయి అని రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.  ఇక్కడ గౌరవ న్యాయమూర్తుల వ్యాఖ్యలు ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వేవిగా గోచరిస్తున్నాయి.  పోలీసు శాఖను కూడా కించపరచేవిగా ఉన్నాయి. 
 
Battle between AP Assembly and AP High Court

ఇవేమి వ్యాఖ్యలు? 

సోషల్ మీడియాతో ప్రభుత్వానికి సంబంధం ఉండదని అందరికీ తెలుసు.  ఎక్కడో ప్రపంచంలో ఏదో మూలన నివసించే ఎవరో సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తే దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం ఏమిటి?  ఎంతో పాపులర్ అయిన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి ఘరానా నేరగాళ్లు వేలకోట్ల రూపాయలు బాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినపుడు సుప్రీమ్ కోర్ట్ కూడా అందుకు మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని వ్యాఖ్యలు చెయ్యలేదు.  ఎంతోమంది వైట్ కాలర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి అధికారపార్టీలో చేరి రక్షణ పొందుతుంటే అందుకు బాధ్యులు ఎవరంటూ సుప్రీమ్ కోర్ట్ కేంద్రాన్ని నిలదీయలేదు.  మరి సోషల్ మీడియాలో ఎవరో అనామకులు కామెంట్స్ పెడుతుంటే అందుకు న్యాయవ్యవస్థ ఎందుకు ఉలిక్కిపడుతున్నది?   సోషల్ మీడియాలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ట్రోలింగ్ కు గురి అవుతుంటారు.  వారు ఎన్నడైనా ఈ విధంగా స్పందించారా?  మరి న్యాయమూర్తులు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారు?  సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులు అన్నీ వ్యవస్థపై కనిపిస్తున్నాయి తప్ప వ్యక్తుల మీద కనిపించడం లేదు.  సోషల్ మీడియాలో పోస్టులకు న్యాయవ్యవస్థ ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నదో అర్ధం కావడం లేదు.   హైకోర్టు ఇచ్చిన తీర్పులు తమకు నచ్చకపోతే సుప్రీమ్ కోర్టులో అప్పీల్ చేసుకోవాలని వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ తీరు తమకు నచ్చకపోతే వారు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు కదా!  

మరి వారు చేస్తున్నది  ప్రభుత్వం పై దండయాత్ర కాదా?

న్యాయవ్యవస్థపై దండయాత్ర చేస్తున్నారని ఆరోపిస్తున్న గౌరవ న్యాయస్థానం తాము చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వ వ్యవస్థపై  దండయాత్రల్లా కనిపించడం లేదా?  సిఐడి విభాగాన్ని అవమానిస్తూ మాట్లాడటం, లెక్క తేలుస్తాం అని బెదిరించడం,  డిజిపి మీద పదేపదే వ్యాఖ్యలు చెయ్యడం…వీటిని ఎలా అర్ధం చేసుకోవాలి?  “విచారణలో భాగంగా మేము వ్యాఖ్యలు చెయ్యవచ్చు…దీనిని ఎవ్వరూ ప్రశ్నించలేరు” అని తమను తాము సమర్ధించుకునే న్యాయవ్యవస్థ ,,,,   అలాంటి వ్యాఖ్యలు చేసే అధికారం, భావప్రకటనా స్వేచ్ఛ ఈ దేశ పౌరులకు, ప్రభుత్వానికి లేదని ప్రకటించాలనుకుంటున్నదా?   అలాగే “ఎలాంటి పక్షపాతం, భయాందోళనలు లేకుండా విధులు నిర్వహిస్తాం అని ప్రమాణం చేశాం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  అదే విధంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రమాణం చేసే అధికారాన్ని చేపడుతారు అన్న సంగతి వారికి తెలియదా?  
 
 
పై అంశాలను సూక్ష్మంగా పరిశీలిస్తే కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా న్యాయవ్యవస్థ ప్రభావితం అవుతున్నదేమో అన్న సందేహం కలుగుతోంది.  “ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవు”  అని న్యాయస్థానం వ్యాఖ్యలు చెయ్యడం తీవ్ర అభ్యంతరకరం.  వారు ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజాభిప్రాయాన్ని అగౌరవపరుస్తున్నారు అని ప్రజలు నమ్ముతున్నారు.  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురవుతున్నట్లుగా దేశంలో మరే రాష్ట్ర హైకోర్టు కూడా విమర్శలకు గురి కావడం లేదు.  ఏపీలో న్యాయవ్యవస్థ నవ్వులపాలవుతున్నట్లు మరే రాష్ట్రంలో కూడా నవ్వుల పాలు కావడం లేదు.  కొన్ని ప్రభుత్వ వ్యతిరేక చానెళ్లకు, మీడియాకు ఎపి హైకోర్టు వ్యవహారశైలి పండుగగా మారిపోయింది.  దానిమీద చర్చోపచర్చలు నిర్వహిస్తూ తమ రేటింగులు పెంచుకుంటున్నారు.  

రెండు వ్యవస్థలూ  సమానమే

ప్రభుత్వం చేసే పొరపాట్లను న్యాయస్థానాలు సమీక్షించవచ్చు.  రాజ్యాంగవ్యతిరేకం అయితే కొట్టేయవచ్చు.  సవరణలు చెయ్యవచ్చు.  అంతే తప్ప ప్రభుత్వాన్ని, ప్రభుత్వాన్ని నడిపేవారిని, అధికారులను, ప్రభుత్వ శాఖలను పరుష పదజాలంతో దూషించే హక్కు, విమర్శించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది సందేహం.  ఒకవేళ ఉంటే మాత్రం అది ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు.   ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం.  అది తప్పైతే దానికి ఫలితం వారే తరువాతి ఎన్నికల్లో అనుభవిస్తారు.  చంద్రబాబు ఐదేళ్లు పాలించినప్పటికీ, ఆయన దుష్పరిపాలన మీద కోర్టు ఒక్క వ్యాఖ్య కూడా చెయ్యలేదు.  ఒక్క అభ్యంతరమూ తెలియజేయలేదు.  కానీ, తదుపరి ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును తరిమివేశారు.  అప్పుడు కోర్టులు చంద్రబాబును రక్షించలేకపోయాయి.  అదే ప్రజాస్వామ్యంలోని గొప్పదనం.  బహుశా న్యాయవ్యవస్థ ఎందుకో ఆ సత్యాన్ని జీర్ణించుకోలేకపోతోంది.  రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఏ ఒక్క వ్యవస్థ మరొక వ్యవస్థ కంటే అధికం కాదు.  అన్ని వ్యవస్థలు సమన్వయముతో పనిచెయ్యాలే తప్ప మరొక వ్యవస్థ మీద పెత్తనం చెలాయించడాన్ని రాజ్యాంగం అనుమతించదు.   ప్రభుత్వం న్యాయవ్యవస్థను,  న్యాయవ్యవస్థ ప్రభుత్వాన్ని నియంత్రించడం మనదేశంలో సాధ్యం కాదు.   రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నదో లెక్కలు తేల్చాల్సింది ప్రజలే తప్ప న్యాయస్థానాలు కాదు.
 
 
పత్రికల్లో ప్రచురితం అయ్యే వార్తల్లో తొంభై శాతము అబద్ధాలే ఉంటాయని,  వాటిని నమ్మి మనం అభిప్రాయాలు వ్యక్తం చేయరాదని, తీర్పులు ఇవ్వరాదని   నలభై ఏళ్ళక్రితమే ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి మాలతీ చందూర్ ఒక పత్రికలో ఆర్టికల్ వ్రాశారు.  అది అక్షరసత్యం అని ఈనాటికీ కొన్ని పత్రికలు రుజువు చేస్తున్నాయి.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు