Chandrababu: అసెంబ్లీలో చారిత్రక తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు!

Chandrababu : “ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని.. అది అమరావతి మాత్రమే. దీనిని ఎవరూ టచ్ చేయలేరు” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపే తీర్మానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

విభజన చట్టంలో సవరణే లక్ష్యం: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5(2)ను సవరించాలని ఈ తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరారు. చట్టంలో రాజధానిని పేర్కొనేచోట ‘ఎట్ అమరావతి’ (At Amaravati) అనే పదాన్ని చేర్చాలని, సీఆర్డీఏ పరిధిలోని ప్రాంతాలన్నిటికీ రాజధాని హోదా వర్తించేలా సవరణ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇప్పటికే రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్ మరియు కేంద్ర హోంమంత్రికి అధికారికంగా పంపారు.

రైతుల త్యాగం వెలకట్టలేనిది: రాజధాని కోసం 34 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులను ఉద్దేశించి చంద్రబాబు భావోద్వేగంగా మాట్లాడారు. “రైతులు ఇచ్చింది కేవలం మట్టి కాదు, రాష్ట్ర భవిష్యత్తును నా చేతుల్లో పెట్టారు” అని కొనియాడారు. రాజధాని కోసం పోరాడిన రైతులపై గత ప్రభుత్వం లాఠీఛార్జీలు, అక్రమ కేసులు బనాయించి ‘కీచకపర్వం’ సాగించిందని ఆయన మండిపడ్డారు.

జగన్‌పై నిప్పులు చెరిగిన సీఎం: ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి వైఖరిని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. “ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపి, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ ఊసరవెల్లి రాజకీయాలు చేశారు. వీరు అనుసరించేది అంబేద్కర్ రాజ్యాంగం కాదు.. రాజారెడ్డి రాజ్యాంగం” అని ఎద్దేవా చేశారు. అమరావతికి రుణాలు రాకుండా ప్రపంచ బ్యాంకుకు మెయిల్స్ పంపిన కుట్రలను కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు.

చరిత్రను కోల్పోయాం.. ఇక నిర్మించుకుందాం: శాతవాహనుల కాలం నాటి అమరావతి వైభవాన్ని గుర్తుచేస్తూ.. మద్రాస్, కర్నూలు, హైదరాబాద్ వంటి రాజధానులను కోల్పోయిన ఆంధ్రుల ఆవేదనను చంద్రబాబు వివరించారు. “వివక్షలు, అవమానాలు భరిస్తూ వచ్చాం. ఇప్పుడు మన ఆత్మగౌరవ ప్రతీకగా అమరావతిని నిర్మించుకుంటున్నాం” అని చెప్పారు.

విజన్ 2028: భవిష్యత్ నగరం దిశగా.. హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా మార్చిన అనుభవంతో, అమరావతిని ‘బ్లూ అండ్ గ్రీన్ సిటీ’గా, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2028 నాటికి రాజధాని పనులన్నీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను (విశాఖ, అమరావతి, రాయలసీమ) సమానంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

Analyst Chillagattu Sreekanth Analysis On MP and MLA Seats Increase | AP Politics | Telugu Rajyam