UPI Payments: యూపీఐపై 18 శాతం జీఎస్టీ..? వైరల్ వార్తలపై కేంద్రం ఏమందంటే?

ఇటీవల కొన్ని రోజులుగా యూపీఐ పేమెంట్స్‌పై జీఎస్టీ విధిస్తారని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రూ.2000 పైబడిన లావాదేవీలపై 18 శాతం జీఎస్టీ విధించనున్నారని, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా చేసే చెల్లింపులకు ఈ పన్ను వర్తిస్తుందని ప్రచారం జరిగింది. దాంతో చాలా మంది ప్రజల్లో గందరగోళం నెలకొంది.

ఈ వార్తలు విస్తృతంగా చక్కర్లు కొట్టడంతో కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. ప్రజలు రోజువారీగా చేసే యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టంగా ప్రకటించింది. ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైన ప్రచారం అని పేర్కొంది. ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందవద్దని సూచించింది.

ప్రస్తుతానికి యూపీఐ సేవలు పూర్తిగా ఉచితంగా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. చిన్న లావాదేవీలు, సామాన్య ప్రజలు చేస్తున్న చెల్లింపులపై ఎటువంటి రుసుము లేదని తెలిపింది. ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలను కేంద్రం తప్పుబట్టింది. ప్రభుత్వానికి అలాంటి ఆలోచనే లేదని, యూపీఐ సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించేందుకు ప్రోత్సహిస్తూనే ఉంటామని వెల్లడించింది.

యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు సులభంగా, వేగంగా, సురక్షితంగా జరుగుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించడం వంటి చర్యలు అసలు ప్రస్తావనలోనే లేవని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని కేంద్రం సూచించింది.

Congress Tulasi Reddy Shocking Comments On Vijay Sai Reddy Liquour Scam Case || Telugu Rajyam