విజయవాడలో దారుణం

విజయవాడలో దారుణం జరిగింది. నిర్భయ ఘటనను తలపించేలా జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ జననాంగంలోకి కట్టెను పెట్టిన దుర్మార్గులు పైశాచిక ఆనందం పొందారు.  పూర్తి వివరాలు ఏంటంటే…

కృష్ణాజిల్లా ముసునూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంటి పక్కనే కుంపటి రాజు, అంజయ్యల ఇల్లు ఉంది. మహిళకు, వారికి ఇంటి స్థలం విషయమై గొడవలు జరుగుతున్నాయి.  నవంబర్ 1 వ తేదిన ఇంటి స్థలం విషయమై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి వారు మహిళ పై మరింత కక్ష్య పెంచుకున్నారు.

గురువారం మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు రాజు, అంజయ్యలు వచ్చారు. తమ మీద ఫిర్యాదు ఇస్తావా అంటూ ఇష్టమొచ్చినట్టు తిట్టి కొట్టారు. అక్కడే ఉన్న ఓ కర్రతో మహిళ తలపై కొట్టడంతో ఆమె కిందపడి స్పృహ కోల్పోయింది.

రాజు, అంజయ్యలు మహిళ కింద పడగానే ఆమె జననాంగంలోకి తమ చేతిలో ఉన్న కర్రను పెట్టి హింసించారు. ఆమెను శరీరమంతా ఇష్టమొచ్చినట్టు గిచ్చుతూ ఆనందించారు. వారు పెట్టే హింసకు మహిళ అరవడంతో చుట్టు పక్కల వారు ఇంట్లోకి వచ్చారు. వారిని చూసిన రాజు, అంజయ్యలు అక్కడి నుంచి పరారయ్యారు.

తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మహిళను గ్రామస్థులు నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మహిళ  దగ్గరి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్ సిద్దేశ్వరి తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

కాగా ఈ ఘటన పై మహిళ సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసన తెలిపారు. మహిళలకు రక్షణ కరువైందని, నిర్భయ ఘటనను తలపించిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ  ఘటన పై ముసునూరు పోలీసులు స్పందించారు. ఇంటి పక్క స్థల వివాదం కావడంతో ముందుగా పెద్ద మనుషులలో పెట్టి మాట్లాడుకోవాలని సూచించామని అయినా కూడా మహిళ ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు తీసుకొని వారిని కూడా స్టేషన్ కు పిలిచి మాట్లాడామన్నారు.

వారి తరపున వచ్చిన వ్యక్తి గ్రామంలో పరిష్కరించుకుంటామని చెప్పడంతో వారం రోజుల్లోగా పరిష్కరించుకోవాలని తెలిపామన్నారు. పంచాయతీ తేలితే కేసు ఉపసంహరించుకుంటానని మహిళ తమకు తెలిపిందన్నారు. అందువల్లే తాము ముందుకు వెళ్లలేదని నిందితులు ఇంత ఘోరానికి తెగబడుతారనుకోలేదని పోలీసులు తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం చర్య తీసుకొని శిక్ష పడేలా చేస్తామన్నారు.