భార్య భర్తలు అన్నప్పుడు చిన్న చిన్న తగాదాలు వస్తూనే ఉంటాయి. మళ్లీ కలిసిపోతుంటారు. అయితే ఏకంగా ఓ భార్య.. భర్తనే మోసం చేసింది. భర్త తనకు డబ్బులు ఇవ్వటం లేదని ఇంట్లోనే దొంగతనం చేసింది. మామూలు దొంగతనం కాదు.
దిల్ సుఖ్ నగర్ కు చెందిన కావలి నారాయణకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య సుధతో కలిసి నారాయణ మైత్రినగర్ గార్డెన్ రెసిడెన్సీలో నివాసముంటున్నారు. ఆయన వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ నెల 28న నారాయణ పని నిమిత్తం చేవెళ్ల వెళ్లారు. ఈ నెల 29న సుధ తన భర్త నారాయణకు ఫోన్ చేసి ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు నీవు డబ్బు ఇవ్వమని చెబితే వారికి ఇంట్లో ఉన్న 41 లక్షలు ఇచ్చానని చెప్పింది. దీంతో షాకైన నారాయణ ఆగమేఘాల మీద ఇంటికి చేరుకుని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు నిర్వహించగా అందులో అనుమానిత వ్యక్తులు ఎవరూ లేరు. పోలీసులు అనుమానంతో సుధను విచారించగా అసలు బండారం బయటపెట్టింది. తన భర్త ఇప్పటి వరకు తన పేరు మీద ఆస్తి రాయలేదని, డబ్బంతా రెండో భార్యకు ఇస్తున్నాడని అందుకే ఇదైన తనకు మిగులుతుందనే ఉద్దేశ్యంతో ఈ నాటకమాడినట్టు సుధ ఒప్పుకుంది. సుధ దాచిపెట్టిన 41 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఆమెను రిమాండ్ కు తరలించారు. ఈ ఆంటీ డబ్బు కోసం ఏకంగా భర్తనే తప్పుదారి పట్టించిదని పలువురు ఆశ్చర్యపోయారు.