తల్లి లేని పిల్లలని రెండవ భార్యతో కలిసి కన్నబిడ్డలను అమ్మేసిన కసాయి తండ్రి…?

తల్లిదండ్రులు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అయితే కొంతమంది తల్లిదండ్రులు మాత్రం కన్న పిల్లల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందులోనూ తల్లి లేని పిల్లలను మరింత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. ఇటీవల ఇటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తల్లి చనిపోతే రెండవ పెళ్లి చేసుకున్న తండ్రి తన రెండవ భార్యతో కలిసి కవల పిల్లల్ని డబ్బు కోసం అమ్మేసిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ కవల పిల్లల్ని కొనుక్కున్న వారి వారిని పెళ్లి చేసుకొని చిత్రహింసలకు గురి చేయటంతో వారిలో ఒక బాలిక అక్కడినుండి తప్పించుకొని పోలీసుల చెంతకు చేరి తమ భాద వెల్లడించింది.

వివరాలలోకి వెళితే…కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన ఒక వ్యక్తి కి ఇద్దరూ కవల పిల్లలు. పిల్లలు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి చనిపోవడంతో ఆ వ్యక్తి కొంతకాలానికే మరొక మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. అతనికి రెండవ భార్యగా వచ్చిన మహిళ ఈ పిల్లలను చిన్నప్పటినుండి చిత్రహింసలకు గురి చేసేది. ఇక రెండవ భార్యకి ఒక కొడుకు ఒక కూతురు ఇలా నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేయలేనని భావించిన ఆ తండ్రి 14 ఏళ్ళు వయసు వచ్చిన ఆ కవల పిల్లలను రెండవ భార్య సహకారంతో తెలిసిన వారి సహాయంతో అమ్మేశాడు. ఇద్దరి కవల పిల్లల్లో ఒకరిని 50 వేలకు కొనుగోలు చేయగా మరొకరిని 80 వేలకు కొనుగోలు చేశారు.

మైనర్ బాలికలను కొనుగోలు చేసిన వారు ఆ బాలికలను వివాహం చేసుకొని వారి మీద లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా అనేక చిత్ర హింసలు పెట్టేవారు. ఇలా చాలా కాలంగా ఆ బాధలు బరిస్తున్న మైనర్ బాలికలలో ఒకరు ఇటీవల వారి చెర నుండి తప్పించుకొని కామారెడ్డికి చేరుకుని డిసిపిఓ స్రవంతిని కలిసి తన గోడువెళ్లగక్కింది. తనతో పాటు తన అక్కని కూడా కూడా మరొక వ్యక్తికి అమ్మేశారని తెలిపింది. బాలిక తెలిపిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మైనర్ బాలికల తల్లిదండ్రులతోపాటు ఈ దారుణానికి పాల్పడిన మరొక ఏడుగురిని అరెస్టు చేసి జైలుకి తరలించారు.