బాలుడి దారుణ హత్య..! గోళ్లు, కాళ్లు విరగ్గొట్టి.. మొహం రక్కేసి..

ఎవరన్నా పగ పట్టారా..? ఎవరిపై అయనా కోపం ఉందో తెలీదు..! అంతటి క్రూరత్వానికి కారణం ఏంటో అర్ధం కాలేదు..! కానీ.. ఇన్ని అనుమానాలూ ఓ ఆరేళ్ల బాలుడి అనుమానాస్పద మృతికి కారణమయ్యాయి. కోతులు ఎత్తుకెళ్లి చంపేశాయని విచిత్రమైన మాటలు ఓవైపు.. ఎవరో కావాలనే హత్య చేసుంటారనే అనుమానాలు మరోవైపు.. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారు అనే వ్యాఖ్యలు మరోవైపు..! మొత్తంగా అభం శుభం తెలీని ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ముద్దులొలికే తమ చిన్నారి లేడనే వార్త ఆ తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచెత్తాయి. విషాదకరమైన ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తాడేపల్లి మండలం మెల్లంపూడిలో భాగవానియా నాయక్, అమల దంపతులు.. ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి రెండో కుమారుడు భార్గవ తేజ. రోజూలానే ఈనెల 14 ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. అయితే.. సాయంత్రం, పొద్దు పోయాక అతడి జాడ తల్లిదండ్రులకు కనిపించలేదు. తెలిసిన వాళ్లింటికి వెళ్లి ఆడుకుంటున్నాడేమోనని వాకబు చేశారు. తెలిసిన వాళ్లింటికి వెళ్లి చూశారు. మొత్తంగా గ్రామం అంతా వెతికారు. బాలుడి జాడ కనిపించలేదు. తీవ్ర ఆందోళన మధ్య తాడేపల్లి పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ.. అంతలోనే ఘోరమైన వార్త వారి చెవిన పడింది. సమీప పొలాల్లో ఓ బాలుడి మృతదేహం ఉందని. వెంటనే అక్కడకు వెళ్లి చూసిన ఆ తల్లిదండ్రులు.. తమ ముద్దుల చిన్నారి నిర్జీవంగా పడి ఉండటం చూసి హతాశులయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. అయితే.. బాలుడి పట్ల అంత కర్కశంగా ఎందుకు వ్యవహరించారో ఎవరికీ అర్ధం కాలేదు. కొందరు కోతులు ఎత్తుకెళ్లి చంపి పడేసి ఉంటాయని విచిత్రంగా మాట్లాడుతున్నారు. కానీ.. బాలుడి మొహం రక్కేసి, వేళ్లు విరిచేసి, కాళ్లు విరిచేసి ఆరేళ్ల చిన్నారిపై అత్యంత క్రూరంగా వ్యవహరించిన ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.