బ్యూటీషియన్ హత్యాయత్నం కేసులో బయటపడ్డ సంచలన నిజాలు

కృష్ణా జిల్లా బ్యూటీషియన్ పద్మ హత్యాయత్నం కేసులో రోజుకో కొత్త విషయం బయట పడుతోంది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో పల్లె పద్మ అనే బ్యూటీషియన్ పై జరిగిన హత్యాయత్నం అత్యంత కిరాతకంగా భయబ్రాంతులకు గురి చేసే విధంగా జరిగింది. ఆమెతో సహజీవనం చేస్తున్న నూతన కుమార్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. కాగా నిందితుడు నూతన్ కుమార్ కూడా రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుడు ఆమెను ఆ విధంగా చంపడం వెనుక ఉన్న నిజాన్ని పోలీసులు పసిగట్టారు.

నూతన్ కుమార్ ఆమెను ప్లాన్ ప్రకారం హత్య చేయడానికి ప్రయత్నించాడు. ముందు ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి…కాళ్ళు, చేతులు కట్టేసి చేతులు నరికి, మొహంపైన కూడా గాయాలు చేసి తర్వాత ఆ మొహానికి కవర్ చుట్టాడు. ఆ తర్వాత అక్కడ నుండి పరారయ్యాడు. అయితే ఆమె, చేతులు నరకడం, మొహంపైన గాయాలు చేయడానికి ఒక కారణం ఉంది.

పద్మ ఎడమ చేతిపైన నూతన్ కుమార్ పేరుకి సింబాలిక్ గా “N” అనే అక్షరం టాట్టూగా ఉండేదని పోలీసులు గుర్తించారు. ఆ “N” అనే అక్షరం ఉన్న చేతి భాగాన్ని నరికేశాడు నూతన్ కుమార్. అంతేకాదు పద్మ నుదుటిపైన “S” అనే అక్షరం బ్లేడ్ తో రాశాడు. అలా ఎందుకు రాశాడంటే పద్మ భర్త పేరు సూర్య నారాయణ. ఆమె భర్త సూర్య నారాయణే ఈ హత్య చేసాడని నమ్మించడానికి అలా చేశాడు. వీరి సహజీవనం ఇష్టం లేక, వారిద్దరిపై కోపంతో “N” అనే లెటర్ నరికేసి “S” అక్షరం సూర్యనారాయణ రాసినట్లు సృష్టించడానికి. అందుకే పద్మ చేతిపై ఉన్న “N” అక్షరం టాట్టూని నరికేసి నుదుటిపై “S” అక్షరం నూతన్ రాసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

భర్త నుండి విడిపోయాక పల్లె పద్మ 4 ఏళ్లుగా నూతన్ కుమార్ తో సహజీవనంలో ఉంది. గత ఏడాది నుండి వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు పోలీస్ స్టేషన్లో నూతన్ కుమార్ పై కంప్లైంట్ ఇచ్చింది పద్మ. హనుమాన్ జంక్షన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రాజీ కుదుర్చుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య మళ్ళీ గొడవలు మొదలవడం, అవి తారాస్థాయికి చేరడంతో ఆమెను హతమొందించి కేసు సూర్యనారాయణపై నెట్టెయ్యాలి అనుకున్నాడు నూతన్ కుమార్. కానీ అనుకోని విధంగా కథ అడ్డం తిరిగింది.

పద్మపై దాడి చేసి పరారయ్యాడు నూతన్ కుమార్. రక్తపు మడుగులో ఉన్న పద్మను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆమెను హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పద్మ పోలీసులకు నూతన్ కుమార్ చేసిన దారుణాన్ని తెలిపింది. దీంతో పోలీయేసులు తనని వదిలిపెట్టరని తెలుసుకున్న నూతన్ కుమార్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బ్యూటీషియన్ పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.