హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం, అంబులెన్సులో ముగ్గురు స్పాట్ డెడ్

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు బొంగ్లూరు గేటు వద్ద కారు అదుపు తప్పి అంబులెన్స్ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

తెల్లవారుజామున 3 గంటలకు అంబులెన్సులో పరిస్థితి విషమంగా ఉన్న రోగిని తీసుకొని హైదరాబాద్ వస్తున్నారు. ఇదే సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రావిరాలకు వస్తున్న కారు అదుపు తప్పి అంబులెన్స్ ను ఢీకొట్టింది.  ఈ ప్రమాదంతో అంబులెన్సులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.  అంబులెన్స్ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు చనిపోయారు. మృతులది కర్ణాటక లోని బళ్లారిగా పోలీసులు గుర్తించారు. అంబులెన్స్ ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. గాయపడ్డ మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. 

కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రాణం కాపాడుకోవడానికి ఆస్పత్రికి వెళుతుంటే వారి ప్రాణాలే పోయాయని అంతా విచారం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.