వివాహేతర సంబంధం వద్దన్నందుకు మామను చంపిన కోడలు, ప్రియుడు

రోజురోజుకు వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయి. వారి సంబంధాలకు అడ్డుగా ఉన్న వారిని చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా తమిళనాడులో కోడలితో సంబంధం పెట్టుకున్న ప్రియుడిని మామ హెచ్చరించాడు. కోపంతో రగిలిపోయిన ప్రియుడు ప్రియురాలి సహాయంతో అతనిని చంపేశాడు. అసలు వివరాలు ఏంటంటే…

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కయత్తారు సమీపంలోని మేలపారైపట్టికి చెందిన అన్నాదురై రైతు. ఇతనికి 50 సంవత్సరాలు ఉంటాయి. అన్నాదురైకి భార్య అనంతమ్మాల్, కుమారుడు హరికృష్ణన్ ఉన్నారు. హరికృష్ణకు ఆరు నెలల క్రితం ప్రేమలత అనే యువతిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత నెల రోజులకే హరికృష్ణ దుబాయికి వెళ్లాడు. దీంతో ప్రేమలతకు సమీపంలోగల ముత్తుమారియప్పన్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రేమలత మామ అన్నాదురై ఇద్దరిని హెచ్చరించాడు.

ఆగ్రహంతో ముత్తు అన్నాదురైతో గొడవకు దిగాడు. ఈ విషయం పై అన్నాదురై పోలీసులకు ఫిర్యాదు చేయగా ముత్తును అరెస్టు చేసి ఆ తర్వాత బెయిల్ పై విడుదల చేశారు. దీంతో ప్రేమలత ముత్తుతో కలవడం లేదు. తమ వివాహేతర సంబంధానికి అన్నాదురై అడ్డుగా ఉన్నాడని భావించిన ముత్తు అతనిని చంపేందుకు ప్లాన్ వేశాడు. ప్రేమలత సహకారంతో అన్నాదురై ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని ముత్తు తెలుసుకున్నాడు.

ముత్తు తన అనుచరులతో కలిసి అన్నాదురై ఇంటికి సోమవారం రాత్రి వెళ్లి కత్తులతో నరికి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో ప్రేమలత పాత్ర కూడా ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.