నిర్భ‌య దోషుల‌కు శిక్ష‌ప‌డుద్దా లేదా?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులకు త్వరలోనే శిక్షలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పటియాలా కోర్టు.. నిందితులను విచారించనుంది. బాధితుల తల్లి దండ్రులు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతోంది. మరోవైపు నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన కుమార్‌ ఠాకూర్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ఈ నెల 17న సుప్రీంకోర్టు విచారించనుంది.

మరోవైపు నలుగురు దోషులను మరి కొద్ది రోజుల్లో ఉరితీయవచ్చునని వస్తున్న ఊహాగానాల మధ్య.. ఈ రివ్యూ పిటిషన్‌ను వచ్చే మంగళవారం విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. దీంతో కచ్చితంగా వారికి శిక్షలు వేసేందుకు సుప్రీం సిద్ధమైందని ప్రచారం మొదలైంది.

మరోవైపు తమకు అవసరమైనప్పుడు ఇద్దరు తలారీలను పంపించాలని ఢిల్లీలోని తీహార్‌ జైలు అధికారులు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. తలారీలను అందించేందుకు సంబంధిత విభాగం సిద్ధంగా ఉందని రాష్ట్ర అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. దోషులను ఉరితీసేందుకు తీహార్‌ జైళ్ల పాలనా యంత్రాంగంలో తలారీలు లేరని.. లక్నో, మీరట్‌లో ఒక్కొక్కరు చొప్పున తలారీలు ఉన్నట్లు సమాచారం అందడంతో, అవసరమైన సమయంలో వారిని పంపాలని డిసెంబర్‌ 9న ఫాక్స్‌ ద్వారా లేఖ అందిందని తెలిపారు. అయితే ఎవరిని ఉరి తీసేందుకో అనేది లేఖలో లేకపోవడంతో.. నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు చేయనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఉరికి కావ‌ల‌సిన తాడుల‌ను కూడా ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లు సమాచారం.