రామ్‌గోపాల్ వ‌ర్మ‌..కేఏ పాల్ కాళ్లు ప‌ట్టుకున్నారా?

సోష‌ల్ మీడియాలో ఓ చిన్న సైజు వార్ న‌డుస్తోంది. ఈ వార్ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌, గ్లోబ‌ల్ పీస్ ఇనిషియేటివ్ చీఫ్ కేఏ పాల్ మ‌ధ్య కావ‌డంతో కాస్త ఆస‌క్తిగా మారింది. ఎప్పుడు క‌లుసుకున్నాడో క్లియ‌ర్‌గా తెలియ‌ట్లేదు గానీ.. రామ్‌గోపాల్ వ‌ర్మ ముంబైలో కేఏ పాల్‌తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కేఏ పాల్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

కేఏ పాల్‌కు కాస్త ప‌క్క‌గా కూర్చున్న ఆర్జీవీ ఆయ‌న చెబుతున్న‌ది ఆస‌క్తిగా వింటూ క‌నిపించిన సంద‌ర్భం అది. త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన వెంట‌నే రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న పాదాల‌ను ముట్టుకున్నార‌ని ఓ కామెంట్ దీనికి జ‌త చేశారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న జ్యోతి, వివేక్ ఆ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతికి గుర‌య్యార‌ని పాల్ రాసుకొచ్చారు. ఇప్ప‌టిదాకా రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న గురువు దాస‌రి నారాయ‌ణ రావు కాళ్ల‌ను కూడా ఎప్పుడూ మొక్క‌లేద‌ని ముక్తాయింపు చెప్పారు. మ‌రో నాలుగు నెల‌ల్లో తాను ఏపీ ముఖ్య‌మంత్రిని కాబోతున్నాన‌ని ముక్తాయింపు ఇచ్చారు.

ఈ ట్వీట్ చూసిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు మండిపోయిన‌ట్టుంది. వెంట‌నే ఆయ‌న దానికి కౌంట‌ర్ ఇచ్చారు..త‌న‌దైన శైలిలో. `ప్రభువా ! నేను పాల్ కాళ్ళు ముట్టుకోలేదు..జస్ట్ పట్టుకుని గట్టిగా లాగితే, వెనక్కి పడి, తల నేల కేసి కొట్టుకుని, తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా ..కాని మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేసా..` అని చుర‌క‌లు అంటించారు.

కేఏ పాల్ ఈ రేంజ్‌లో ఆర్జీవీ మీద ఆగ్ర‌హానికి గురి కావ‌డానికీ ఓ కార‌ణం ఉంది. ఏపీ ఎన్నిక‌ల్లో కేఏ పాల్ పోటీ చేసి, 175 స్థానాల‌ను గెలుచుకుంటార‌ని, ఈ ప్ర‌పంచంలో ఏసు క్రీస్తు త‌రువాత ఆయ‌నంత‌టి గొప్ప వ్య‌క్తి అని ఎద్దేవా చేస్తూ కొద్దిరోజుల కింద‌ట రామ్ గోపాల్ వ‌ర్మ ఓ ట్వీట్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాల్ తాజాగా ఫైర్ అయ్యార‌ని చెబుతున్నారు.