అయోమయంలో  బన్నీ- సుక్కూ టీం!?

బన్నీకి బంపర్ హిట్టివ్వడానికి సుక్కూ ఎంత తొందర పడుతున్నాడో  పరిస్థితులు అంత వెనక్కి లాగుతున్నాయి. నిజానికి బన్నీ  సుక్కూ కాంబోలో రావాల్సిన హ్యాట్రిక్ ప్రాజెక్టు ఏఏ20 షూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉన్నారు. కీలక సన్నివేశాల షూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నా  అడుగుమాత్రం ముందుకు పడటం లేదు.
 
ఫారెస్ట్ నేపథ్యంగా సాగే కథ కనుక  కీలక సన్నివేశాలను బ్యాంకాక్ ఫారెస్ట్ లోకేషన్స్‌లో ప్లాన్ చేశాడట దర్శకుడు సుకుమార్. సరిగ్గా అదే టైంలో అల.. వైకుంఠపురంలో సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టనిపించుకోవడంతో  సెలబ్రేషన్స్ కోసం బ్రేక్ తీసుకున్నాడు హీరో అల్లు అర్జున్. సుదీర్ఘంగా సాగిన సెలబ్రేషన్స్ కారణంగా ప్రాజెక్టుకు బ్రేక్ తప్పలేదు. తరువాత.. బ్యాకాంక్ ట్రిప్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన టైంలో  కరోనా ఉధృతరూపం దాల్చింది. కరోనా దెబ్బకు అల్లాడుతున్న తూర్పు ఆసియా దేశాల్లో బ్యాంకాంక్ సైతం ఉండటంతో  షెడ్యూల్‌ను మళ్లీ వాయిదా వేశారు.
 
ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి వచ్చే దసరాకే సెట్స్‌పైకి తెద్దామన్న నిర్మాతల ప్రతిపాదన మేరకు ఫారెస్ట్  షెడ్యూల్ మొత్తాన్ని కేరళలో పూర్తి చేయడానికే సుక్కూ ప్లాన్ చేశాడట. ఆ ప్లాన్‌కూ బ్రేక్ వేస్తూ  కేరళలో కరోనా పాజిటివ్ కేసులు పెరగటంతో ఏఏ20 టీం మళ్లీ అయోమయంలో పడింది. కరోనా దెబ్బకు కేరళలో మార్చి 31 వరకూ థియేటర్లు మూసేసే నిర్ణయాన్ని తీసుకుంటున్నారు.
 
ఇంతటి అననుకూల పరిస్థితుల్లో షూట్‌కి వెళ్లేకంటే  కొద్దినెలలు వాయిదా వేసుకోవడమే ఉత్తమమన్న ఆలోచనలో సుక్కూ టీం ఉందని సమాచారం. శేషాచలం అడవుల్లో జరిగే స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కనున్న ప్రాజెక్టులో రష్మిక మండన్న హీరోయిన్‌గా, విజయ్ సేతుపతి విలన్ పాత్రలు పోషించనున్నారు.