విజయ డెయిరీ ఎన్నికలు : పాతికేళ్ల భూమా వర్గం ఆధిపత్యానికి చెక్ .. వైసీపీ వర్గం ఘనవిజయం !

కర్నూలు జిల్లా నంద్యాలలో విజయ డెయిరీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అనుకూలురైన రవికాంత్ రెడ్డి, ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి డైరెక్టర్లుగా విజయం సాధించారు. తద్వారా చైర్మన్ పదవి రేసులో వైసీపీ మరింత బలంగా నిలిచింది.

YCP supporters win director posts in Nandyala Vijaya Dairy elections

విజయ డెయిరీ పరిధిలో మొత్తం 81 ఓట్లు ఉండగా, 80 మంది ఓటు హక్కు వినియోగించకున్నారు. విజయ డెయిరీ పాలకమండలిలో సభ్యత్వం ఉన్న భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి , భూమా నాగిరెడ్డి తనయుడు , బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దాంతో అతడు ఓటు హక్కు వినియోగించుకోలేదు.

కాగా, ఎంతో ప్రతిష్ఠాత్మక నంద్యాల విజయ డెయిరీలో భూమా కుటుంబ సభ్యుల ఆధిపత్యానికి ఈ ఎన్నికలు తెరదించాయి. గత 25 సంవత్సరాలుగా భూమా కుటుంబం బలపరిచిన వారే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి వైసీపీ ప్రాభవం స్పష్టంగా కనిపించింది. దాంతో, విజయ డెయిరీ పగ్గాలు భూమా కుటుంబం నుంచి ఎస్వీ కుటుంబానికి అందనున్నాయి. కొత్తగా ఎన్నికైన ముగ్గురు డైరెక్టర్లు, పాత డైరెక్టర్లు నలుగురు.. వైఎస్సార్‌సీపీ మద్దతు దారుడు ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో విజయ పాల డెయిరీ చైర్మన్‌గా ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికైనట్లు డెయిరీ ఎండీ ప్రసాదరెడ్డి ప్రకటించారు.