వైసీపీకి ఇదే బలం… చిరుకి “నలుగురు మొనగాళ్లు” సినిమా చూపించారు!

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి వ్యాఖ్యలు.. ఆ వ్యాఖ్యలకు వైసీపీ నేతల కౌంటర్లు, సెటైర్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఏమి చేయాలి, ఏమి ఆలోచించాలి అనే విషయంపై చిరంజీవి స్పందించగా… ఆ మాటలకు కౌంటర్ గా కొడాలి నాని, పేర్ని నాని, అమర్నాథ్, బొత్స సత్యనారాయణ స్పందించారు.

అవును… ఏపీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీలోని రెమ్యునరేషన్స్ గురించి ఎందుకు.. ఆలోచించాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఇండస్ట్రీపై పడతారెందుకు అని చిరంజీవి వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. వైసీపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా బ్యాలెన్సింగ గా మాట్లాడటం గమనార్హం.

ఇందులో భాగంగా ముందుగా కొడాలి నాని తనదైన శైలిలో ఫుల్ డోస్ ఇచ్చి పడేశారు. జగన్ సర్కార్ పై ఎవరు అవాకులూ చెవాకులూ పేలినా.. వాయింపులో మార్పుండదని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఇందులో భాగంగా ఎత్తుకోవడం ఎత్తుకోవడమే పకోడి గాళ్లు అంటూ మొదలుపెట్టారు కొడాలి నాని.

వాల్తేరు వీరయ్య 200 డేస్‌ ఫంక్షన్‌ లో చిరంజీవి చేసిన పొలిటికల్‌ కామెంట్లకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు. “సినీ పరిశ్రమలో చాలామంది పకోడీగాళ్లున్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో ఆ పకోడీగాళ్లు కూడా సలహాలు ఇస్తున్నారు.. ఆ సలహాలేవో అవతలి వారికి కూడా ఇసే బాగుంటుంది” అంటూ సెటైర్లు వేశారు.

ఇదే సమయంలో.. “ప్రభుత్వం గురించి మనకెందుకురాబాబు” అని సలహాలు ఇవ్వొచ్చు కదా అని సూచించారు. మనం డాన్స్‌ లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందామని చెప్పొచ్చు కదా అని అన్నారు. కేవలం ఒక్క ప్రభుత్వానికే కాకుండా… ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని కొడాలి తనదైన శైలిలో తెలిపారు.

ఈ మాస్ డోస్ అయిపోయిన తర్వాత బొత్సా సత్యన్నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా చిరు వ్యాఖ్యలపై స్పందించిన బొత్స… సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని అంగీకరించారా? చిరంజీవి చెప్పాలని ప్రశ్నించారు. “ఏపీలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. చిరంజీవి ఎందుకు వ్యాఖ్యలు చేశారో చెప్పాలి. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తుంది” అని మంత్రి బొత్స అన్నారు.

ఇదే సమయంలో “మేం వారాహి యాత్రను అడ్డుకోం. యాత్రల పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ఊరుకోం” అని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో యాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు. విశాఖలో పవన్‌ వారాహి యాత్రపై దేశమంతా చర్చ జరుగుతుందని అంటున్నారు. చంద్రబాబు పుంగనూరు యాత్ర మాదిరిగా విధ్వంసం చేయాలని చూస్తున్నారా” అని బొత్స ప్రశ్నించారు.

ఇలా కొడాలి వాయింపు, బొత్స తాలింపు అనంతరం ఫ్యాన్ అంటూ పేర్ని నాని తగులుకున్నారు. గిల్లితే గిల్లించుకోరు.. తిరిగి గిల్లుతారు అని స్మూత్ గా మొదలుపెట్టారు. అవును… ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు పేర్ని నానీ సమాధానం ఇచ్చారు.

చిరంజీవికి వ్యక్తిగతంగా తాను అభిమానిని అని మొదలుపెట్టిన పేర్ని నాని… హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి ఏపీ సచివాలయానికి ఎంత దూరమో.. ఏపీ సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్‌ కి అంతే దూరం అని అన్నారు. ఇది పరోక్షంగా అత్యంత స్పష్టంగా చెప్పడం. అనంటరం ప్రత్యక్షంగా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు పేర్ని.

ఇందులో భాగంగా… పోకిరీ సినిమాలోని ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ చెప్పినట్లు… గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు.. అనే డైలగ్ రాజకీయాల్లో వర్తించదని తెలిపారు. సినిమాల్లో గిల్లినోళ్లకూ గిల్లించుకున్నోళ్లకు.. ఇద్దరికీ డబ్బులు ఇస్తారని చెప్పిన నాని.. రాజకీయాల్లో గిల్లిన వాళ్లను తిరిగి గిల్లుతారని మరింత క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు.

ఇదే సమయంలో… కాస్త డోస్ పెంచి చురకలు అంటించిన పేర్ని… ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై సూటిగా స్పందించారు. ఇందులో భాగంగా… “రాష్ట్ర విజభన సమయంలో చిరంజీవి ఏ పార్టీలో ఉ‍న్నారు? చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా హామీ వచ్చింది.. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అప్పుడు చిరంజీవి ఎందుకు మాట్లాడలేదు?” అని ప్రశ్నించారు.

ఇలా ముగ్గురూ ఎవరి స్టైల్లో వాళ్లు చిరుకి ఇచ్చి పడేసిన అనంతరం ఫ్రెషర్ అమర్నాథ్ రంగంలోకి దిగారు. సినిమాలను పిచ్చుక అని తక్కువ చేస్తే ఎలా అని చిరంజీవిని ప్రశ్నించారు. సినిమాల్లోకి రాజకీయాలను తెచ్చిందే పవన్‌ కల్యాణ్‌ అని గుర్తుచేశారు. ఫలితంగా… ముందుగా చిరంజీవి తన తమ్ముడికి జ్ఞానబోధ చేయాలని, శుభ్రం చేయాల్సింది ముందుగా తన తమ్ముడినే అని తెలిపారు.

దీంతో వైసీపీకి ఇదే బలం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకరు ఫుల్ గా వాయించి వదిలితే… మరొకరు కాస్త మృదువుగా చెబుతారు… ఇంకొకరు పెద్దరికంగా మాట్లాడుతుంటారు.. మరి కొందరు జోలపాడుతున్నట్లే పాడుతూ గిల్లు తుంటారు! ఏది ఏమైనప్పటికీ… చిరంజీవికి “నలుగురు మొనగాళ్లు” సినిమా అయితే చూపించారని అంటున్నారు నెటిజన్లు.