ఆయన దీవెనలు – అందరి మన్ననలు : వై ఎస్ జగన్ పాలనకి రూట్ మ్యాప్ YSR దే !

YS Jagan

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన ఎంతో మంది నేతలకు ఆదర్శం. ఆయన పాలన నుండి ఇన్స్పిరేషన్ పొందిన ఎంతో మంది రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన ప్రజలకు అభయ హస్తంగా ఉండేది. ఆయన ఇచ్చిన మాటను తప్పరని తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కేవలం భౌతికంగా లేరు. కాని ఆ రాజ్యం వర్ధిల్లుతోంది. ఆ సంక్షేమం ముందంజలో ఉంది. ఆ సంస్కారం తలమానికం అయింది.

ప్రతి అమ్మ తన చీరకొంగులో నాలుగు డబ్బులను పదిలంగా ముడివేసుకుంటోంది. బతుకు మీద భరోసాతో రైతు భుజాన నాగలి వేసుకొని పొలం వైపు అడుగులు వేస్తున్నాడు. ఆంధ్రరాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ జీవితానికి ఒక ఆసరా ఉందని గుండెల మీద చేతులు వేసుకుని నిదురపోతున్నారు. భీతావహమైన ఈ కరోనా కాలంలో కూడా పేదోడికి వైద్యం ఒక ఫోన్‌కాల్‌ దూరంలోకి వచ్చింది. ఆధునిక వైద్యానికి అన్ని విధాలా హామీ లభించింది. కాళ్లు చాపుకుని పడుకునేందుకు కూడా కల కనలేని నిరుపేద సొంత ఇంటి స్థలం పట్టాను కళ్లకద్దుకోనున్నాడు.

2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనా విధానాన్ని అనుసరిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నుండి నేర్చుకున్న పాఠాల నుండే జగన్ మోహన్ రెడ్డి తన పాలన కొనసాగిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డిని కోల్పోయిన ఆయన అభిమానులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూపంలో రాజశేఖర్ రెడ్డిని చూసుకుంటూ ఆనందిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఎన్నో పథకాల రూపకల్పన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మూడు రాజధానుల అంశం కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూపొందించారని వైసీపీ శ్రేణులు తెలుపుతున్నారు.