ప్రణీత్ హనుమంతు తర్వాత హైపర్ ఆది వైపు చూస్తారా?

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తండ్రీకూతుళ్ల మధ్య బంధం గురించి ఇతడు చేసిన విచక్షణ మరిచిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ నోటి డ్యాష్ ఫలితంగా బెంగళూరులో ఇతడిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ప్రస్తుతం నాంపల్లి కోర్టు 14 రోజులరిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో హైపర్ ఆది వ్యవహారం తెరపైకి వచ్చింది!

అవును… తండ్రీకూతుళ్ల బంధంపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన ప్రణీత్ హనుమంతు వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యిన సంగతి తెలిసిందే. ఇతడు చేసిన పనికిమాలిన వ్యాఖ్యలపై అటు సినీ ఇండస్ట్రీ జనాలు, మహిళా సంఘాలు, నెటిజన్లూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సాయిధరం తేజ్ అయితే చంద్రబాబు, రేవంత్ రెడ్డి లను ట్యాగ్ చేస్తూ.. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే ఇంత తీవ్రమైన, వివాదాస్పదమైన వ్యవహారంపై చంద్రబాబు స్పందించలేదు కానీ రేవంత్ మాత్రం రియాక్ట్ అయ్యారు. దీంతో తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు ప్రణీత్ ని అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించారు. ఆ సంగతి అలా ఉంటే… ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా టీవీ షోలలో వచ్చే అడల్ట్ కంటెంట్ గురించిన చర్చ తెరపైకి వచ్చింది. కామెడీ పేరు చెప్పి కొంతమంది సాగిస్తున్న దౌర్భాగ్యకరమైన డబుల్ మీనింగులపై చర్చ మొదలైంది!

ఇందులో భాగంగా ప్రాధానంగా ఈటీవీలో వచ్చే జబర్ధస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోలలో కామెడీ పేరు చెప్పి చేసే వల్గర్ వ్యాఖ్యలు హద్దుదాటి పోతున్నాయనే వ్యాఖ్యలు గత కొంతకాలంగా వినిపిస్తుంది. ప్రధానంగా సెక్సువల్, డబుల్ మీనింగ్ కంటెంట్ రోజు రోజుకీ ఎక్కువ అవుతుందని అంటునారు. దీంతో ఈ రెండు షోలలోనూ దౌర్భాగ్యకరమైన పరిస్థితికి కారణం ఓ కమెడియన్ అని అంటున్నారు నెటిజన్లు! అతడు ఎంటీ ఇచ్చినప్పటి నుంచే డైలాగ్ కీ డబుల్ మీనింగ్ డైలాగ్ కీ తేడా లేకుండా పోయిందని చెబుతున్నారు!

వాస్తవానికి మొదట్లో జబర్ధస్త్ షో కాస్త హెల్తీగానే ఉండెది. ఇంట్లో మహిళలు, పిల్లలు కూడా చూసేవారు! అయితే… హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఈ కామెడీ పేరు చెప్పి చేసే వికృత చేష్టలు, జుగుప్సాకరమైన మాటలు విపరీతంగా పెరిగిపోయాయనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. తన స్కిట్స్ లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వేయడం, బాడీ షేమింగ్ వంటివి అతడి నిత్యకృత్యం అనే విమర్శలు వచ్చాయి!

ఈ బూతు డైలాగులకు అప్పట్లో జడ్జిగా వ్యవహరించిన నాగబాబు పూర్తిగా సమర్ధిస్తున్నట్లు, ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడంతో… ఇతడు మరింత చెలరేగిపోయాడు. దీంతో… ఇదో ట్రెండ్ అనుకున్నారో.. లేక, ఇదే సక్సెస్ ఫార్ములా అనుకున్నారో మిగిలిన టీం లీడర్లు చాలా మంది ఇదే పంథాలో ప్రయాణించడం మొదలుపెట్టారు. దీంతో… ఇప్పుడు టీవీల్లో ఈ షో వస్తుంటే.. పక్కన పిల్లలు ఉంటే ఛానల్ మార్చేసే పేరెంట్స్ ఎక్కువైపోయారని అంటున్నారు.

వాస్తవానికి మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ కు మంచి పేరుంది. గతంలో మంచి మంచి సినిమాలు అందించిన ఘనత ఉంది. ఈ నేపథ్యంలో బుల్లి తెరపై మంచి కామెడీ షో అందించారని అనుకునేలోపు… దాన్ని కాస్తా బూతు కామెడీగా మార్చేశారనే వాదన తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో… బూతు కామెడీ చేస్తూ హైపర్ ఆది పబ్బం గడుపుకుంటున్నాడనే ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో… యూట్యూబ్ లో వచ్చే కంటెంట్ కంటే ఇలా నేరుగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే షోలో వచ్చే అశ్లీల కామెడీ వల్లే పిల్లలు చెడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యలో యూట్యూబర్ ప్రణీత్ విషయంలో స్పందించినట్లుగానే.. బూతు కామెడీలు చేసే బుల్లి తెర షోలపైనా పోలీసులు ఓ కన్నేయాలని, మంచు విష్ణు స్పందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!